న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనలపై బాలీవుడ్ నటీనటులు మౌనంగా ఉండటంపై షా ఇటీవల విమర్శలు చేశారు. ‘నోటిలో ఎముక ఉన్న కుక్క మొరగలేదు’ అని వ్యాఖ్యానిస్తూ, సెలబ్రిటీల మౌనాన్ని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జార్ఖండ్లో జరుగుతున్న నిరసనల గురించి నసీరుద్దీన్ షా ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ, సీనియర్ నటుడిని ‘లొమ్డి’ (నక్క) అని అభివర్ణించారు. ‘ఇక్కడ నిజం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి వద్ద పని చేస్తున్నారు. కానీ, ఏ దేశపు రొట్టె తింటున్నానో, ఆ దేశాన్ని రక్షించడం, దాని కోసం పోరాడటం నాకు గర్వకారణం. నసీరుద్దీన్ షా తిన్నది ఈ దేశపు అన్నమే అయినా, పక్క దేశం కోసం వాదిస్తున్నారు’ అని కంగనా ఘాటుగా విమర్శించారు.
కుక్కను ‘లొమ్డి’తో పోలుస్తూ, ‘నేటి కాలంలో విశ్వసనీయత చాలా అరుదు. అందుకే నసీరుద్దీన్ షా లాంటివారు నక్కగా ఉండటం కంటే, కుక్కగా ఉండటమే మేలు’ అని ఆమె పేర్కొన్నారు. గతంలో నసీరుద్దీన్ షా .. బాలీవుడ్ నటుల మౌనంపై అసహనం వ్యక్తం చేశారు. వారి మనస్సాక్షికి తగిన సమయం వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా స్పందిస్తారని, అయితే ప్రస్తుతం వారు ఎముక నోట్లో పెట్టుకున్న కుక్కల్లా ఉన్నారని చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
ఇది కూడా చదవండి: Time Travel: 1977 నుంచి 4413కు వెళ్లాక .. ఏం జరిగిదంటే..


