ఆమె కండక్టర్‌తో వెళ్లిపోయింది.. అంతే! | Malayalam Influencer Akhil NRD Breaks Silence After Wifes Viral Exit | Sakshi
Sakshi News home page

ఆమె కండక్టర్‌తో వెళ్లిపోయింది.. అంతే!

Aug 12 2026 8:38 AM | Updated on Aug 12 2026 8:50 AM

Malayalam Influencer Akhil NRD Breaks Silence After Wifes Viral Exit

వివాహేతర సంబంధాల మోజులో.. నేరాలు-ఘోరాలు జరుగుతున్న కాలం ఇది. కట్టుకున్న బంధాలను పక్కన పెట్టి క్షణిక సుఖాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. అనుమానాలు, ఆవేదనలు, ఆగ్రహాలతో పలు ఘటనలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి.. అందునా సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయిన వ్యక్తి, అందమైన తన భార్య ఓ కండక్టర్‌కి మనసిచ్చి వెళ్లిపోయిందంటూ నేరుగా వీడియో రిలీజ్‌ చేయడం సంచలన చర్చకు దారి తీసింది.

మలయాళ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, నటుడు అఖిల్‌ NRD వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తన భార్య మేఘా ఓ కండక్గర్‌తో వెళ్లిపోయిందని నేరుగా ఆయనే వీడియో విడుదల చేయడం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. నైటీలో లగేజీతో ఆమె స్పీడ్‌గా వెళ్లి.. ఓ వ్యక్తితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వివాహేతర సంబంధాల నేరాల నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. 

అయితే భర్తను చంపకుండా వదిలేసి వెళ్లిపోయింది ఆమె గ్రేట్‌ అంటూ కొందరు.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇదేం పని? అని మరికొందరు.. ఆ కండక్టర్‌లో ఆమెకేం నచ్చిందో అని మరికొందరు ఇలా కామెంట్ల రచ్చతో చర్చకు దారి తీశారు. ఈ నేపథ్యంలో.. 

ఈ పరిణామంపై అఖిల్‌ స్నేహితుడు, మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సాయి కృష్ణ స్పందించడంతో మరింత ఆసక్తి నెలకొంది. అఖిల్‌-మేఘా వివాహానికి తాను హాజరయ్యానని చెప్పిన సాయి కృష్ణ.. ఈ వార్త విని తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఈ విషయంపై అఖిల్‌తో మాట్లాడానని, అయితే ఈ విషయంలో ఎవరినీ నిందించేందుకు అఖిల్‌ ఇష్టపడటం లేదని పేర్కొన్నారు.

“ఆమె వెళ్లిపోయింది.. అంతే!”
భార్య చేసిన నమ్మక ద్రోహంపై అఖిల్‌ రియాక్షన్‌ను సాయి కృష్ణ మీడియాకు వెల్లడించాడు. ఆమె వెళ్లిపోయింది అంతే అని ఒక్క ముక్కలో తేల్చేశాడు. ‘‘ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టను..నిందించను. దేవుడు నాకు ఇలా రాసిపెట్టాడు. ఇలాంటి పరిస్థితులు ఎవరి జీవితంలోనైనా ఎదురవుతాయి. నా తల్లిదండ్రులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిననే అనుకుంటున్నా. ఈ విషయాన్ని మరింతగా చర్చించడం ఇష్టం లేదు’’ అంటూ అఖిల్‌ అన్నాడట.

సోషల్‌ మీడియాలో ఈ వ్యవహారంపై వస్తున్న చర్చలపై కూడా సాయి కృష్ణ స్పందించారు. పరిచయమైన వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటిని సంచలనంగా మార్చకుండా, కొంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

మెర్చంట్‌ నేవీ నుంచి సోషల్‌ మీడియా స్టార్‌..
అఖిల్‌ ఎన్‌ఆర్‌డీ ప్రయాణం కూడా ప్రత్యేకమైనదే. తొలుత ఆయన మెర్చంట్‌ నేవీలో పనిచేశాడు. ఆ తర్వాత డిజిటల్‌ కంటెంట్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టాడు. టిక్‌టాక్‌ ద్వారా వీడియోలు చేయడం ప్రారంభించి.. కామెడీ వీడియోలు, లైఫ్‌స్టైల్‌ కంటెంట్‌, వ్లాగ్స్‌తో భారీగా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. తర్వాత యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన యూట్యూబ్‌ ఛానల్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్‌ మీడియా పాపులారిటీతో నటుడిగానూ అవకాశాలు అందుకున్నాడు.

సినిమాల్లోకి ఎంట్రీ
సోషల్‌ మీడియా స్టార్‌ నుంచి మాలీవుడ్‌లో చిన్నాచితకా అవకాశాలు అందుకున్నాడు అఖిల్‌.  2026లో మలయాళ చిత్రం ‘ఆశకల్‌ ఆయిరం’ ద్వారా నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘మహారాజా హాస్టల్‌’ చిత్రంలోనూ నటించాడు. సోషల్‌ మీడియా స్టార్‌ నుంచి సినిమా నటుడిగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది.

2024లో వివాహం..
అఖిల్‌, మేఘా కొంతకాలం ప్రేమలో ఉన్న అనంతరం 2024లో వివాహం చేసుకున్నారు. మేఘా కూడా అఖిల్‌ సోషల్‌ మీడియా పోస్టుల్లో కనిపించేవారు. వీరి జంటకు అభిమానుల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జరిగిన దానిపై మేఘగానీ, ఆమె కుటుంబంగానీ ఇంకా స్పందించలేదు. అయితే.. అఖిల్‌ వీడియో రిలీజ్‌ చేశాక ‘‘ఇది కూడా సోషల్‌ మీడియా స్టంటేనా?’’ అని కొందరు అనుమానం సైతం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement