సర్పట్ట పరంపరై, రాయన్, వేట్టయాన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమున్న హీరోయిన్ దుషారా విజయన్.. గతవారం 'జీడీ నాయుడు'తో థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రేమలో ఉన్న సంగతి బయటపెట్టింది. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నానని.. అయితే తాను ప్రేమలో పడటానికి ఇళయరాజా ఓ కారణమని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
(ఇదీ చదవండి: కాబోయే భార్య గురించి విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
'ప్రస్తుతం నేను ప్రేమలో ఉన్నాను. దాని గురించి ఎక్కువగా చెప్పలేను కానీ రిలేషన్షిప్లో రెండేళ్లుగా ఉన్నాం. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితం చాలా బాగుంది. పెళ్లెప్పుడు చేసుకోవాలని ఇంకా అనుకోలేదు. నా తల్లిదండ్రులకు కూడా ఈ సంగతి తెలుసు. సినిమాల్లోకి రావడానికి నేను ఎంతలా కష్టపడ్డానని వారికి తెలుసు కాబట్టి వివాహం విషయమై నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు'
'నా పార్ట్నర్ కూడా నా కెరీర్ని ఎంతో సపోర్ట్ చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం. అతడి దగ్గర నేను చిన్నపిల్లలా ఉంటాను. ప్రతి విషయంలోనూ అతడిపైనే ఆధారపడతాను. నా దగ్గర రూ.1000 ఉంటే, నేను ప్రేమించే వాళ్లకు దాన్ని ఇచ్చేస్తాను. నా ప్రేమ అలాంటిది. నేను ఎదుటివారికి ఇచ్చే గౌరవమే నాకు కూడా తిరిగి రావాలని కోరుకుంటాను. ప్రేమలో నేను చూసేది గౌరవం, నమ్మకం మాత్రమే'
'మా ఇద్దరికీ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. మా తొలి పరిచయం దుబాయ్లో జరిగింది. మా నాన్న స్నేహితుడి ద్వారా ఆయనతో పరిచయమయ్యాడు. మేమిద్దరం కలిసి కారులో వెళ్తున్నప్పుడు ఇళయరాజా పాట ప్లే అయింది. అది నాకు ఇష్టమైన పాట కావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. మా ఇద్దరినీ కలిపిన తొలి అంశం ఇళయరాజానే అని నాకు అనిపిస్తుంది' అని దుషార తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: 'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం)


