న్యూఢిల్లీ: ఫుకెట్–ఢిల్లీ ఎయిర్ ఇండియా ఏఐ2379 విమానాన్ని నడిపించిన పైలట్–ఇన్–కమాండ్ ఆ సమయంలో మాదక ద్రవ్యాలు తీసుకున్నాడని రెండో నిర్ధారణ పరీక్షల్లో తేలినట్లు అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఆగస్టు 4వ తేదీన థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం హఠాత్తుగా కుదుపులకు లోనై, 300 మీటర్ల ఎత్తును కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. ఆ విమానంలో విధులు నిర్వర్తించిన ఇద్దరు పైలట్లకు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఒక పైలట్కు డ్రగ్స్ నెగెటివ్గా తేలింది. పైలట్–ఇన్–కమాండ్కు చేసిన ప్రాథమిక పరీక్షలో మరింత నిర్ధారణ అవసరం కావడంతో, అతడి నమూనాలను నిర్దేశిత ప్రయోగశాలకు పంపారు.ఈ నిర్ధారణ పరీక్షలో మరిజువానా(గంజాయి) ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడయ్యింది. అంటే సదరు ప్రధాన పైలట్ గంజాయి సేవించి విమానాన్ని నడిపించినట్లు గుర్తించారు. విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరు పైలట్లను విమాన విధులకు సంబంధించిన జాబితా నుంచి ఇప్పటికే తొలగించారు.


