రాంచీలో ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తం
110 మంది ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
శాసనసభలో నిరసన వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో రణరంగంగా మారిన విద్యార్థుల ఉద్యమంలో పరీక్షార్థులపై పోలీసులు విచక్షణారహిత లాఠీచార్జ్ ఘటనను తీవ్రంగా నిరసిస్తూ విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో, బీజేపీ అనుబంధ అఖిలభారత విద్యార్థి పరిషత్ అసెంబ్లీ బయట తీవ్రస్థాయిలో తమ నిరసనను వ్యక్తంచేశాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ(జేఎస్ఎస్సీ)ల ఉద్యోగ నియామక ప్రక్రియలు, పరీక్షల్లో సంస్కరణల సాధన కోసం పరీక్షార్థులు సోమవారం రాంచీలో చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడం తెల్సిందే. మంగళవారం వందలాది మంది ఏబీవీపీ కార్యకర్తలు పాత విధానసభ నుంచి కొత్త శాననసభకు నడుచుకుంటూ, బస్సులో ర్యాలీగా రాగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తోపులాట ఎక్కువవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు 110 మంది కార్యకర్తలను అరెస్ట్చేశారు. వీరిలో మహిళా కార్యకర్తలూ ఉన్నారు. తోపులాటలో ఒక అమ్మాయి, అబ్బాయి స్పృహతప్పి పడిపోయారు. ‘‘నియామక ప్రక్రియలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తుంటే కారణంలేకుండా చాలా మందిని పోలీస్ వ్యాన్లలోకి పడేశారు. పలువురికి గాయాలయ్యాయి’’అని ఏబీవీపీ కార్యకర్త కుమార్ దివ్యాన్షు చెప్పారు. లాఠీచార్జ్ను ఖండిస్తూ బీజేపీ ఇచి్చన బంద్ పిలుపుమేరకు జార్ఖండ్ రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, కళాశాలలు, పాఠశాలలు మూసేశారు. వ్యాపారసముదాయాలు మూసేయడం, ప్రజారవాణా వ్యవస్థలు స్తంభించడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
అసెంబ్లీలో నిరసనలు
ఉద్యమిస్తున్న పరీక్షార్థులపై పోలీసులు లాఠీలకు పనిజెప్పడమేంటంటూ సోరెన్ సర్కార్ను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో నిలదీశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను స్తంభింపజేశారు. దీంతో ఉదయం సభ మొదలైన కొన్ని నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడింది. 12 గంటలకు మొదలైనా నినాదాలు ఆగకపోవడంతో 2 గంటలవరకు వాయిదావేశారు. 2 గంటలకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు పోటాపోటీగా వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరీక్షల రద్దు, సంస్కరణల విషయంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందని సభలో సీఎం హేమంత్ ప్రకటించారు.
‘‘ఉద్యమకారులను బీజేపీ తమ రాజకీయ పనిముట్లుగా వాడుకోవాలని చూస్తోంది. మా ప్రభుత్వం ఇప్పటికే ఉద్యమకారుల చాలా డిమాండ్లను అంగీకరించింది. నియామక పరీక్షల విధానంలో సంస్కరణలకూ ఓకే చెప్పా. బీజేపీ ఒక పరాన్నజీవి. స్వప్రయోజనాల కోసం పరీక్షార్థులను వాడుకోవాలని చూస్తోంది. బీజేపీ విషయంలో ఉద్యమకారులు జాగ్రత్తగా ఉండాలి’’అని అన్నారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ నినాదాల హోరు పెంచారు. దీంతో షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే సభను స్పీకర్ నిరవధికంగా వాయిదావేశారు.
రాంచీలో విద్యార్థుల మౌన ప్రదర్శన
నియామక పరీక్షల్లో అక్రమాలను ఎత్తిచూపుతూ జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ సంస్కరణ ల మంచ్ విద్యార్థులు, పరీక్షార్థులు మంగళవారం సాయంత్రం రాంచీలో మౌన ప్రదర్శన చేశారు. నిరాహార దీక్ష జరుగుతున్న జైపాల్సింగ్ స్టేడియం నుంచి ఆల్బర్ట్ ఎక్కా చౌక వరకు వందలాది మంది విద్యార్థులు మౌన ప్రదర్శనగా వెళ్లారు. ఉద్యమం, నిరాహార దీక్షలు మొదలై 17 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ మౌన ప్రదర్శన చేపట్టారు. జూలై 25వ తేదీన విద్యార్థుల ఉద్యమం ఆరంభమైన విషయం విదితమే. ఆరుగురు ఉద్యమనేతలు నిరాహార దీక్షకు కూర్చోగా వీరిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రుల్లో చేరి్పంచారు.


