గురువాయూర్: కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో వివాహాల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. మలయాళ మాసం ‘చింగం’ నెలలో వచ్చే మొదటి ఆదివారం (ఆగస్టు 23) రోజున ఏకంగా 377 వివాహాలు జరగనున్నట్లు ఆలయ దేవస్థానం ప్రకటించింది. ఇప్పటివరకు నమోదైన గణాంకాల ప్రకారం ఇది సరికొత్త రికార్డు. ఇంకా 13 రోజుల సమయం ఉండటంతో, ఈ సంఖ్య 400 దాటే అవకాశం ఉందని దేవస్థానం వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గతంలో 2024, సెప్టెంబర్ 8న 334 వివాహాలు జరగడమే ఇప్పటివరకు ఉన్న అత్యధిక రికార్డు. ఈసారి రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివాహాలు జరిపించేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఆలయంలో ఐదవ శాశ్వత వివాహ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ భక్తుడు దీనిని విరాళంగా సమర్పించారు. శిల్పి సుధీల్ కుమార్ పర్యవేక్షణలో ఈ నిర్మాణం జరుగుతోంది.
సాధారణంగా ఆలయంలో 200కు పైగా వివాహాలు ఉన్నప్పుడు తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేసేవారు. అయితే, భవిష్యత్తులో రద్దీని తట్టుకునేందుకు ఈసారి శాశ్వత ప్రాతిపదికన కొత్త మండపాన్ని సిద్ధం చేశారు. మరోవైపు, ఆలయంలో రద్దీని నియంత్రించేందుకు, భక్తుల వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు దేవస్థానం ఆగస్టు 4 నుంచి ‘వర్చువల్ క్యూ’ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రస్తుతం మంగళ, గురువారాల్లో అమలవుతున్న ఈ విధానం ద్వారా రోజుకు 2,400 మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఓనం సీజన్, ఇతర పండుగ రోజుల్లో భక్తుల రద్దీని నిర్వహించడానికి ఈ డిజిటల్ వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: డేరా బాబా విడుదలపై సుప్రీంకోర్టు సీరియస్!


