టెహ్రాన్: ఇరాన్ అత్యున్నత నేత మొజ్తబా ఖమేనీ దేశ సాయుధ బలగాలు, రివల్యూషనరీ గార్డ్స్లో ఆరుగురు కొత్త సీనియర్ సైనిక కమాండర్లను నియమించారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖాళీ అయిన కీలక పదవులను భర్తీ చేస్తూ ఈ నియామకాలు జరిగాయి. యుద్ధ కాల నాయకత్వ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ నియామకాల ప్రకారం మేజర్ జనరల్ పైలట్ అలీ అబ్దుల్లాహిని సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమించారు. అలాగే బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహిదీని మేజర్ జనరల్ హోదాతో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కమాండర్-ఇన్-చీఫ్గా ఖరారు చేశారు. గతంలో ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ కమాండర్గా పనిచేసిన అబ్దుల్లాహి, యుద్ధ సమయంలో కీలక పాత్ర పోషించారు. యుద్ధ ప్రారంభ రోజున జరిగిన దాడుల్లో నాటి చీఫ్ అబ్దోల్లాహి మూసావి ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఖాళీ ఏర్పడింది.
ఇక సైన్యం మాజీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ కియుమర్స్ హేడారీని చీఫ్ ఆఫ్ స్టాఫ్ డిప్యూటీగా, సైబర్ సెక్యూరిటీ విభాగం మాజీ కమాండర్ మొస్తఫా ఇజాదీని ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్-ఇన్-చీఫ్గా నియమించారు. అలాగే రియర్ అడ్మిరల్ అలీ అజ్మయీని ఐఆర్జీసీ నేవీ కమాండర్గా, హొసేన్ తాయ్ను బాసిజ్ పారామిలిటరీ ఫోర్స్ కమాండర్గా ఖరారు చేశారు. మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇరాన్ తన సైనిక దళాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ఇది కూడా చదవండి: కూరగాయల కొట్టు నుంచి అండర్వరల్డ్ సింహాసనం వరకు..


