కొలంబియాలో భూకంప విలయం.. పెరుగుతున్న మృతుల సంఖ్య! | 7.4 magnitude earthquake strikes Colombia | Sakshi
Sakshi News home page

కొలంబియాలో భూకంప విలయం.. అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య!

Aug 11 2026 1:05 AM | Updated on Aug 11 2026 1:09 AM

7.4 magnitude earthquake strikes Colombia

బొగోటా: దక్షిణ అమెరికా ఖండంలో వరుస భూకంపాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు నెలల క్రితం వెనెజువెలాలో సంభవించిన భూకంప ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఆ విషాదం నుంచి కోలుకోకముందే తాజాగా పొరుగు దేశమైన కొలంబియాలో సంభవించిన తీవ్ర భూకంపం పెను నాశనాన్ని మిగిల్చింది.

అసోసియేటెడ్‌ ప్రెస్‌ కథనం ప్రకారం.. పశ్చిమ కొలంబియాలోని చోకో ప్రావిన్స్‌లో భూగర్భంలో 107 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 7.4 రిక్టర్ స్కేలు ఎక్కువగా ఉండటం వల్ల ఉపరితలంపై భారీ ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించాయి. సోమవారం అర్ధరాత్రి సమయానికి ఈ ప్రకృతి విలయం కారణంగా కనీసం 111 మంది మరణించగా, 87 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పసిఫిక్ తీరానికి సమీపంలోని చోకో ప్రావిన్స్‌లో ఉన్న 'శాన్ జోస్ డెల్ పాల్మార్' పట్టణానికి తూర్పున ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు భూగర్భ పరిశోధన కేంద్రాలు వెల్లడించాయి. ఈ భూకంపం ధాటికి కాలి  నగరంలోనే దాదాపు 25 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. పెరీరా, మనిజాలెస్ నగరాల్లో వందలాది ఇళ్లు, చారిత్రక చర్చిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రతకు భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలడంతో నగరాలన్నీ శిథిలాల కుప్పలుగా మారాయి.

ఈ భూకంప ప్రభావం చోకో రాజధాని క్విబ్డో, పెరీరా, కాలి, మనిజాలెస్ వంటి నగరాలపై అత్యంత తీవ్రంగా ఉంది. దీని ప్రకంపనలు కొలంబియా రాజధాని బొగోటాతో పాటు పొరుగు దేశాలైన ఈక్వెడార్, పనామా, వెనెజువెలా వరకు తీవ్రంగా వ్యాపించాయి. ఈ విపత్తు కారణంగా పెరీరా అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని సుమారు ఆరు ప్రధాన విమానాశ్రయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.

ఈ ఘోర విపత్తుపై కొలంబియా నూతన అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రిల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ దేశంలో 'జాతీయ అత్యవసర పరిస్థితి' ప్రకటించారు. శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను సురక్షితంగా బయటకు తీసి, ప్రాణాలు కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. 

కాగా,ఈ ఏడాది జూన్‌లో పొరుగున ఉన్న వెనెజువెలాలో సంభవించిన భారీ భూకంపాల తర్వాత, ఈ ప్రాంతంలో సంభవించిన మరో అత్యంత ఘోరమైన విపత్తుగా ఇది నమోదైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement