ఆ దేశ సైనిక పాలకులు ఆడుతున్న మైండ్ గేమ్స్ ఇవే.. | Myanmars New Mind Game | Sakshi
Sakshi News home page

ఆ దేశ సైనిక పాలకులు ఆడుతున్న మైండ్ గేమ్స్ ఇవే..

Aug 10 2026 9:28 PM | Updated on Aug 10 2026 9:28 PM

 Myanmars New Mind Game

ఎన్నో ఏళ్లుగా గృహనిర్బంధంలో మగ్గుతున్న మయన్మార్ ప్రజాస్వామ్య నేత ఆంగ్ సాన్ సూ కీని ఎట్టకేలకు రెడ్ క్రాస్ ప్రతినిధి కలవడం ప్రపంచ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఒకవైపు దేశంలో దారుణమైన సివిల్ వార్ (అంతర్యుద్ధం) కొనసాగుతుండగా, మరోవైపు మయన్మార్ సైనిక పాలకులు అంతర్జాతీయ వేదికలపై తమపై ఉన్న ఏకాకితనాన్ని (International Isolation) పోగొట్టుకునేందుకు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. 

ఇందులో భాగంగానే భారత్, చైనా, లావోస్, థాయ్‌లాండ్ దేశాలతో దౌత్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. కంటికి కనిపించకుండా సాగుతున్న ఈ దౌత్య రాజకీయాల వెనుక అసలు మయన్మార్ సైన్యం పన్నిన వ్యూహం ఏమిటి? అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటుతో మయన్మార్ ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. ఎన్నికల్లో విజయం సాధించిన ఆంగ్ సాన్ సూ కీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు, 'పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్' (PDF) రూపంలో తిరుగుబాటు చేయడంతో దేశం పూర్తిస్థాయి అంతర్యుద్ధంలోకి జారిపోయింది.

గత కొన్నేళ్లుగా జరిగిన పోరులో జాతి సాయుధ సంస్థల చేతిలో సైన్యం భారీగానే భూభాగాన్ని కోల్పోయింది. అయితే, జనాభా ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాలపై పట్టు నిలుపుకున్న సైన్యం, గత ఏడాదిన్నరగా కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దాడులను తీవ్రం చేసింది.

ఒత్తిళ్లను తట్టుకునేందుకు యత్నాలు 
అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకునేందుకు, తన ప్రభుత్వాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు సైనిక చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ డ్రామాలు మొదలుపెట్టారు. గత డిసెంబర్, జనవరి నెలల్లో ఎన్నికలు నిర్వహించి, తానే స్వయంగా సైనిక పదవి నుంచి తప్పుకుని అధ్యక్షుడిగా పీఠం ఎక్కారు. 

సివిల్ ప్రభుత్వం ముసుగు వేసుకున్న తర్వాత ఆయన తన అంతర్జాతీయ పర్యటనలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా దేశాల్లో అధికారిక పర్యటనలు చేసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు భద్రత, చైనా ఆధిపత్యం, వాణిజ్య ప్రయోజనాలరీత్యా పొరుగు దేశాలు కూడా మయన్మార్ ప్రభుత్వంతో తిరిగి సంబంధాలు నెరపుతున్నాయి.

ఆసియాన్ కూటమిలో చోటు కోసం.. 
ముఖ్యంగా ఆసియాన్ (ASEAN) కూటమిలో తిరిగి చోటు దక్కించుకోవడానికి మయన్మార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. థాయ్‌లాండ్ వంటి దేశాలు సరిహద్దు భద్రత, శరణార్థుల సమస్యలు, డ్రగ్స్ అండ్ సైబర్ స్కామ్ కాంపౌండ్ల నియంత్రణ కోసం మయన్మార్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఆసియాన్ విధించిన 'ఐదు సూత్రాల శాంతి ఒప్పందాన్ని' మయన్మార్ పార్లమెంట్ ఏకంగా విదేశీ జోక్యంగా అభివర్ణించి తిరస్కరించింది. 

ఈ నేపథ్యంలో ఆంగ్ సాన్ సూ కీని రెడ్ క్రాస్ ప్రతినిధి కలవడానికి అనుమతించడం అనేది మయన్మార్ మారుతోందడానికి సంకేతం కాదని, ఆసియాన్ కూటమిలో దేశాల మధ్య ఐక్యతను దెబ్బతీసి, తమపై ఒత్తిడి తగ్గించుకునేందుకు సైన్యం ఆడిన ఒక 'కాస్ట్-ఫ్రీ' మైండ్ గేట్ మాత్రమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement