7.4 తీవ్రతతో భారీ భూకంపం.. 20 మంది మృతి | Magnitude 7 4 earthquake strikes Colombian capital Bogota | Sakshi
Sakshi News home page

7.4 తీవ్రతతో భారీ భూకంపం.. 20 మంది మృతి

Aug 10 2026 8:47 PM | Updated on Aug 10 2026 9:05 PM

 Magnitude 7 4 earthquake strikes Colombian capital Bogota

బొగోటా: కొలంబియా పశ్చిమ ప్రాంతంలో సోమవారం 7.4 తీవ్రతతో (రిక్టర్‌ స్కేలుపై) భారీ భూకంపం సంభవించింది. క్విబ్డో, పెరెయిరా, కాలి సహా పలు నగరాల్లో  తీవ్ర నష్టం వాటిల్లింది. పలు విమానాశ్రయాల కార్యకలాపాలు కూడా అంతరాయం ఎదుర్కొన్నాయి. ఈ ప్రకంపనలు రాజధాని బొగోటాతో పాటు పొరుగు దేశాలైన వెనిజులా, ఈక్వడార్ వరకు సంభవించాయి.

ఈ భూకంపం కొలంబియా పశ్చిమ ప్రాంతమంతటా తీవ్ర నష్టం సృష్టించింది. దాదాపు 20 మంది మరణించారు. పెరెయిరాలో 18 మంది మరణించినట్లు ఆ నగర మేయర్ తెలిపారు. మనిజాలెస్‌లో ఇద్దరు మరణించినట్లు అక్కడి మేయర్ బ్లూ రేడియోకు తెలిపారు. కాలిలో 20 భవనాలు కూలిపోయాయి. వాటిలో ప్రజలు చిక్కుకుపోయినట్లు నగర మేయర్ తెలిపారు. పెరెయిరా, మనిజాలెస్, క్విబ్డో, ఆర్మేనియా, కార్టాగో, బ్యూనావెంచురా విమానాశ్రయాల్లో కూడా నష్టం నమోదైంది. అక్కడ విమాన కార్యకలాపాలు నిలిపివేసినట్లు కొలంబియా విమానయాన సంస్థ వెల్లడించింది.

అమెరికా భూగర్భ సర్వే, కొలంబియా భౌగోళిక సేవ సంస్థలు ఈ భూకంప తీవ్రత 7.4గా తెలిపాయి. భూకంప కేంద్రం బొగోటాకు పశ్చిమంగా సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాన్ జోసే డెల్ పాల్మార్ సమీపంలో, 96 కిలోమీటర్ల లోతులో నమోదైంది.

కొలంబియా అధ్యక్షుడు అబెలార్డో డే లా ఎస్ప్రియెల్లా ఎక్స్‌లో చేసిన పోస్టులో.. పునరుద్ధరణ చర్యలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని, సాన్ జోసే డెల్ పాల్మార్‌లో అత్యవసర కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు.

“సాన్ జోసే డెల్ పాల్మార్‌లో అత్యవసర ప్రతిస్పందనకు నేను నేరుగా నాయకత్వం వహిస్తున్నాను. నష్టాలు, ప్రభావిత వ్యక్తులకు సహాయం సమన్వయం చేసేందుకు కమాండ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించాను. పరిస్థితి, అత్యవసర అవసరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని యూఎన్‌జీఆర్‌డీ డైరెక్టర్‌ను కోరాను. ప్రభావిత ప్రజలకు అండగా నిలిచేందుకు, ప్రభుత్వ స్పందనను పరిశీలించేందుకు నేను స్వయంగా పెరెయిరాకు వెళ్తాను” అని ఆయన తెలిపారు.

చోకో గవర్నర్ నూబియా కరోలినా కొర్డోబా-క్యూరి మాట్లాడుతూ, ప్రావిన్స్ రాజధాని క్విబ్డోలో గాయాలు, భవనాలకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలిపారు. అధికారులు ప్రభావాన్ని అంచనా వేయడం ప్రారంభించారని చెప్పారు. అనంతర ప్రకంపనలపై కూడా ఆమె హెచ్చరించారు.

“చోకో విభాగంలో ఇప్పుడే భారీ భూకంపం వచ్చింది. అనంతర ప్రకంపనలపై మాకు ఆందోళనగా ఉంది. కేంద్రం సాన్ జోసే డెల్ పాల్మార్ సమీపంలో ఉన్నప్పటికీ, రాజధాని క్విబ్డోలో గాయాలు, భవనాలకు తీవ్ర నష్టం జరిగింది. నష్టాల అంచనా ప్రక్రియ కొనసాగుతోంది. తొలి అధికారిక నివేదికను త్వరలో విడుదల చేస్తాము” అని నూబియా కరోలినా కొర్డోబా-క్యూరి ఎక్స్‌లో పేర్కొన్నారు.

రిసరాల్డా ప్రావిన్స్ గవర్నర్ జువాన్ డియాగో పాటినో స్థానిక బ్లూ రేడియోతో మాట్లాడుతూ.. ప్రావిన్స్ రాజధాని పెరెయిరాలో కొన్ని భవనాలకు తీవ్ర నష్టంజరిగినట్లు తెలిపారు. “గాయపడిన ప్రజలు, కూలిపోయిన భవనాల దృశ్యాలు నిజంగా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి” అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement