భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీన ఘనంగా జరుపుకుంటాం. అయితే ఈ తేదీని ఫిక్స్ చేయడానికి చాలానే చర్చలు జరిగాయట. మనకు స్వాత్వంత్యం వచ్చిన తర్వాత ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి ఒక తేదీని నిర్ణయించాలని అప్పటి పెద్దలు సమాలోచనలు చేశారట. 1946లో భారతదేశ స్వాతంత్ర్యం ఖరారైన తర్వాత 1947లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నమ్మకస్తుడైన గోస్వామి గణేష్ దత్ మహారాజ్ ద్వారా ఉజ్జయిన్కు చెందిన జ్యోతిష్కుడు పండిట్ సూర్యనారాయణ వ్యాస్ను ఢిల్లీకి పిలిపించారు.
పండిట్ సూర్యనారాయణ వ్యాస్ అనే ఆయన జ్యోతిష్యంలో సిద్ధహస్తుడు. అందులోనూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సైతం జ్యోతిష్యం అంటే అమితమైన నమ్మకం. దాంతో పండిట్ సూర్యనారయణ ద్వారా ఒక తేదీని ఫిక్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రెండింటిలో ఏది బెస్ట్..?
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరపడానికి రెండు తేదీలను ఫిక్స్ చేశారు. ఒకటి ఆగస్టు 14వ తేదీ కాగా, రెండోది ఆగస్గు 15వ తేదీ. అయితే ఈ రెండు తేదీలలో ఒకదాన్ని ఎంచుకోవడం సవాల్గా మారింది. బ్రిటిష్ వారి నుండి అధికారాన్ని బదిలీ చేయడానికి ఆగష్టు 14, 15 అనే రెండు తేదీలు అందుబాటులో ఉన్నాయని పండిట్ సూర్యనారాయణకు చెప్పారు.
ఫలితంగా ప్రఖ్యాతగా జ్యోతిష్కునిగా ఉన్న పండిట్ సూర్యనారాయణ వ్యాన్ ఈ రెండు తేదీలను పరిశీలించిన తర్వాత ఆగస్టు 15వ తేదీకి మొగ్గుచూపారు. ఆగస్టు 14వ తేదీ లగ్న బలం లేదని, అంటే జాతక చక్రంలో తొలి స్థానంలో బాలేదని, అది అంత కూలమైనది కాదని తేల్చిచెప్పారు. అదే సమయంలో ఆగస్టు 15వ తేదీనే అనుకూలంగా ఉందని డేట్ ఫిక్స్ చేశారట. స్వాతంత్ర్యానికి ఆగస్టు 15వ తేదీ అత్యంత అనువైన తేదీ అని ఆయన ప్రకటించారు
జాతకంలో ఆగస్టు 14వ తేదీన లగ్నం అస్థిరంగా ఉంటుందని ఆయన విశ్వసించారు. అందువల్ల, స్వాతంత్ర్యానికి ఆగస్టు 15వ తేదీ అత్యంత అనువైన తేదీ అని ఆయన ప్రకటించారు..ఇలా వచ్చింది ఆగస్టు 15వ తేదీ.
ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పండిట్ సూర్యనారాయణ వ్యాస్ కుమారుడు, దూరదర్శన్ మాజీ డైరెక్టర్ జనరల్, రచయిత అయిన రాజశేఖర్ వ్యాస్ అందించారు. ఆయన ప్రకారం, శుభ సమయాన్ని నిర్ధారించిన తర్వాత, స్వాతంత్ర్యానికి అర్ధరాత్రి సమయం అనుకూలంగా ఉందని పండిట్ వ్యాస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో చెప్పారట. జెండా ఎగురవేయడం, స్వాతంత్ర్య వేడుకను అర్ధరాత్రి నిర్వహించాలని, ఇతర కార్యక్రమాలను ఉదయాన్నే జరపాలని ఆయన సూచించారట.
పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయన సలహాను పాటించి, అర్ధరాత్రి ఎర్రకోటపై జెండాను ఎగురవేశారని చెబుతారు. అయితే ఆగస్టు 15వ తేదీ ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ భవనం (నాటి కౌన్సిల్ హౌస్) పై జరిగింది. ఆ సమయంలో లార్డ్ మౌంట్బాటన్ సమక్షంలో బ్రిటిష్ జెండా 'యూనియన్ జాక్'ను కిందకు దించి, మన భారత జాతీయ జెండాను తొలిసారిగా పైకి ఎగురవేశారు.
మరి కొన్ని ఆసక్తికర విషయాలు..
పండిట్ సూర్యనారాయణ వ్యాస్ 1902లో జన్మించారు. ఆయనకు సంబంధించిన పుస్తకాల ప్రకారం, ఆయన 1921లోనే స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందని, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దేశానికి రాష్ట్రపతి అవుతారని ఆయన 1930లోనే జోస్యం చెప్పారని అంటారు.
1952లో, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పదవీకాలం ముగింపు దశకు వస్తున్నప్పుడు, ఆయన తిరిగి రాష్ట్రపతిగా ఎన్నికవుతారని పండిట్ వ్యాస్ మరోసారి జోస్యం చెప్పారు. ఈ ప్రకటన ఆ తర్వాత నిజమని రుజువైంది. అప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తాను చెప్పినట్లే జరిగిందని అంగీకరిస్తూ పండిట్ వ్యాస్కు ఒక లేఖ రాసినట్లు సమాచారం.
14వ తేదీని ఎంచుకున్న జిన్నా..
పండిట్ వ్యాసుడు పాకిస్తాన్ గురించి కూడా ఒక జోస్యం చెప్పారు. భారతదేశ స్వాతంత్ర్యానికి శుభ ముహూర్తాన్ని లెక్కిస్తున్నప్పుడు, పండిట్ వ్యాసుడు పాకిస్తాన్ ఏర్పాటు గురించి కూడా హెచ్చరించారు. ఒకవేళ ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పడితే, అది శాశ్వతంగా అస్థిరంగా ఉంటుందని అంటారు. ఆ రోజున మేష లగ్నం ఉండటం, గురు గ్రహం శత్రు స్థానంలో ఉండటమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. మహమ్మద్ అలీ జిన్నా క్యాలెండర్ను, శుభ సమయాన్ని నమ్మేవారు కాదు. అందువల్ల, పాకిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఆగస్టు 14వ తేదీని ఎంచుకున్నారనేది సారాంశం. అలా పండిట్ సూర్యనారాయణ భారతదేశ స్వాతంత్య్ర తేదీని ఫిక్స్ చేయడంలో ముఖ్య భూమిక పోషించారట.
ఇదీ చదవండి:
79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?


