Tour: చరిత్ర చెప్పే భారత యాత్ర | From Manyam To Kalapani, Explore 5 Historic Places That Tell The Story Of The Nation Independence Struggle | Sakshi
Sakshi News home page

India Freedom Trail: చరిత్ర చెప్పే భారత యాత్ర

Aug 10 2026 10:07 AM | Updated on Aug 10 2026 11:23 AM

Awkward Things To Do On The Journey From Manyam To Kalapani

పర్యటన

మన్యం నుంచి కాలాపాని వరకు

కొన్ని ప్రదేశాలు మ్యాపులో కనిపించే లొకేషన్లు మాత్రమే కావు. అవి ఒక దేశ జ్ఞాపకాలు కూడా. అక్కడి నేల, గోడలు, దారులు అన్నీ అక్కడి త్యాగాల కథలను నేటికీ చెబుతూనే ఉంటాయి. భారత స్వాతంత్య్ర పోరాటం అనగానే కొన్ని ప్రముఖ నగరాలు ప్రదేశాలు, కట్టడాలు గుర్తొస్తాయి. అయితే దేశంలోని ప్రతిప్రాంతం తన వంతు పోరాట స్మృతులను రాసుకుంది. మన తెలుగు నేల కూడా అలాంటి వీర చరిత్రకు నిలయం.

ఆంధ్రప్రదేశ్‌ అడవుల్లో వినిపించే మన్యం పోరాట స్వరాల నుంచి అండమాన్‌ సముద్రం మధ్యలో ఉన్న సెల్యులర్‌ జైలు వరకు ఈ ఫ్రీడమ్‌ ట్రెయిల్‌ యాత్ర (India Freedom Trail) భారత స్వాతంత్య్ర స్పూర్తిని పరిచయం చేస్తుంది. దేశం కోసం పోరాడిన వీరుల అడుగుజాడలను స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపే ఆనాటి పోరాట కథలు చెప్పే ప్రదేశాలను సందర్శించడానికి 5 రోజుల భారత్‌ ఫ్రీడమ్‌ ట్రెయిల్‌ ఇది..

మన్యం అడవుల్లో స్వాతంత్య్ర పోరాట జాడలు...
ఆంధ్రప్రదేశ్‌ తూర్పు కనుమల మధ్యలో ఉన్న మన్యంప్రాంతం ప్రకృతి అందాలతో పాటు ఒక వీర చరిత్రను కూడా మోసుకొస్తుంది. అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా నడిపిన రంపా పోరాటం తెలుగు స్వాతంత్య్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం.

కొండలు, అడవులు, గిరిజన జీవన విధానం మధ్య ఆయన పోరాట జ్ఞాపకాలను ఇప్పటికీ ఆప్రాంతంలో ఫీల్‌ అవ్వవచ్చు. అల్లూరి పేరు వినగానే తెలుగు ప్రజల మనసులో ఒక వీరుడి రూపం కనిపిస్తుంది. మన్యం పోరాటం జరిగిన ప్రదేశాల్లో ప్రయాణం చేస్తే ప్రకతితో పాటు చరిత్ర కూడా మనతో నడుస్తున్నట్టు అనిపిస్తుంది.

హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి లేక విశాఖపట్టణం చేరుకుని అక్కడి నుంచి రోడ్‌ జర్నీలో ఏజెన్సీప్రాంతాలకు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి రాజమండ్రి మార్గం కూడా అనుకూలంగా ఉంటుంది. రాజమండ్రి, రంపచోడవరం, మారేడుమిల్లిప్రాంతాల్లో స్టే ఆప్షన్స్‌ లభిస్తాయి.

దండి మార్చ్‌కు నాంది పలికిన సబర్మతి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతి ఆశ్రమం ఒక ప్రశాంతమైన చారిత్రక ప్రదేశం. సబర్మతి నదీ తీరంలో ఉన్న ఈ ఆశ్రమం నుంచి మహాత్మా గాంధీ అనేక ఉద్యమాలకు మార్గదర్శనం చేశారు. 1930లోప్రారంభమైన దాండీ మార్చ్‌ కూడా ఇక్కడేప్రారంభం అయింది.

  • ఆశ్రమంలో మహాత్ముడు ఉపయోగించిన వస్తువులు, ఫొటోగ్రాఫ్స్, లెటర్స్‌ చరిత్రను దగ్గరగా పరిచయం చేస్తాయి.

  • సబర్మతి ఆశ్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పర్యాటకుల కోసం తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీజు తీసుకోరు.

  • ఈ ఆశ్రమాన్ని సందర్శించాలి అనుకుంటే ముందుగా గుజరాత్‌లోని  అహ్మదాబాద్‌కు చేరుకోవాలి. హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు ఫ్లైట్స్‌ అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌ లేక చెన్నై ద్వారా ఇక్కడికి  చేరుకోవచ్చు.

  • అహ్మదాబాద్‌లో బడ్జెట్‌ హోటల్స్‌ రూ.1500 నుంచి రూ.3000, కంఫర్టబుల్‌ హోటల్స్‌ రూ.3000 నుంచి రూ.7500 వరకు బడ్జెట్‌లో లభిస్తాయి.

కాలాపాని సెల్యులర్ జైలు.. స్వాతంత్య్ర సమరయోధుల కన్నీటి గాథ
సముద్రం మధ్యలో ఉన్న అండమాన్‌ ద్వీపాల్లో సెల్యులర్‌ జైల్‌ చరిత్ర తెలుసుకుంటే నాటి పోరాటం వెనక ఉన్న త్యాగాలు అర్థం అవుతాయి. బ్రిటిష్‌ కాలంలో వీర్‌ సావర్కర్‌తో పాటు అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులను ఇక్కడే బంధించారు. జైల్‌లో ఉన్న ప్రతి గది దేశ భక్తుల త్యాగం, వారి పోరాటం గురించి మౌనంగా వివరిస్తుంది. ఇప్పుడు సెల్యులర్‌ జైలును నేషనల్‌ మెమోరియల్‌గా మార్చి పర్యాటకుల కోసం తెరిచి ఉంచారు. సందర్శకులు మ్యూజియం, పాత కారాగారాలు, ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ జ్ఞాపకాలను చూడవచ్చు.

  • భారతీయ పర్యాటకులకు ఇక్కడికి వెళ్లేందుకు సుమారు రూ.30 ఎంట్రీ ఫీజు ఉంటుంది. సాయంత్రం జరిగే లైట్‌ అండ్‌ సౌండ్‌ షో ఈ ప్రదేశ చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. షో టికెట్‌ కాస్ట్‌ వచ్చేసి రూ.300.

  • కాలాపాని వెళ్లాలి అనుకునే ప్రయాణికులు హైదరాబాద్‌ నుంచి చెన్నై లేక కోల్‌కతా ద్వారా పోర్ట్‌ బ్లెయిర్‌ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి చెన్నై రూట్‌లో వెళ్లడం సులువుగా ఉంటుంది.

  • పోర్ట్‌ బ్లెయిర్‌లో బడ్జెట్‌ హోటల్స్‌ రూ.1500 నుంచి రూ.3000 వరకు లభిస్తాయి. కాస్త కంఫర్టబుల్‌ స్టే కావాలి అనుకుంటే మాత్రం రూ.3000 నుంచి రూ.6000 మధ్యలో లభిస్తాయి.

సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని తెలిపే నేతాజీ భవన్‌
పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో ఉన్న నేతాజి భవన్‌  అనేది సుభాష్‌ చంద్రబోస్‌ జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసే ఒక ముఖ్యమైన వారసత్వ సంపద. ఇక్కడ నేతాజి ఉపయోగించిన వస్తువులు, ఫోటోగ్రాఫ్స్, డాక్యుమెంట్స్‌ భద్రపరిచారు. దేశం కోసం ఆయన చేసిన పోరాటాల గురించి తెలుస్తాయి.

  • నేతాజి భవన్‌ టూరిస్టుల కోసం తెరిచే ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి కలకత్తా వరకు డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ ఉన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌ లేక చెన్నై ద్వారా చేరుకోవచ్చు. కలకత్తాలో బడ్జెట్‌ స్టే రూ.1,000 నుంచి రూ.3000లో లభిస్తుంది.

జలియన్‌ వాలా బాగ్‌.. నెత్తుటి చరిత్రకు సాక్ష్యం
పంజాబ్‌లో ఉన్న జలియన్‌ వాలా బాగ్‌ భారత చరిత్రలో ఒక పీడకలగా మిగిలిపోయింది. 1919లో జరిగిన జలియన్‌ వాలా బాగ్‌ ఘటన భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక కొత్త దిశను ఇచ్చింది. ఇప్పుడు ఇది ఒక మెమోరియల్‌గా నిలిచి, ఆ నాటి చేదు జ్ఞాపకాలను నేటి తరానికి అందిస్తోంది.

  • టూరిస్టులు ఇక్కడ మెమోరియల్, మ్యూజియం, చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఎంట్రీ సాధారణంగా ఫ్రీగా ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి అమత్‌సర్‌ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి ఢిల్లీ రూట్‌ అనుకూలంగానే ఉంటుంది.

  • అమృత్‌సర్‌లో గోల్డెన్‌ టెంపుల్‌ దగ్గర స్టే ఆప్షన్స్‌ ఎక్కువగా ఉంటాయి. బడ్జెట్‌ హోటల్స్‌ రూ.1,000 నుంచి రూ.2500 మధ్యలో దొరుకుతాయి. కంఫర్టబుల్‌గా స్టే చేయాలి అంటే రూ.3000 నుంచి రూ.5000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ప్రతి ప్రాంతంలోని ప్రత్యేకమైన రుచులు
ఈ యాత్రలో ప్రతిప్రాంతం తన రుచులతో పరిచయం చేస్తుంది. ఆంధ్రా మన్యంప్రాంతాల్లో లోకల్‌ గిరిజన రుచులు, గోదావరి స్పెషల్‌ వంటకాలను ఆస్వాదించవచ్చు.

అండమాన్‌ లో సీఫుడ్‌తో పాటు దక్షిణాది వంటకాలు లభిస్తాయి. గుజరాత్‌లో ఢోక్లా, తెప్లా, గుజరాతీ థాలీ, పంజాబ్‌లో అమత్‌సర్‌ కుల్చా, కోల్‌కతాలో బెంగాలీ స్వీట్స్‌ ఈ ట్రావెల్‌ ఎక్స్‌పీరియెన్స్‌లో భాగం అవుతాయి.

5 రోజుల ఫ్రీడమ్‌ ట్రెయిల్‌.. ఎంత బడ్జెట్‌ కావాలి?
ఈ ఫ్రీడమ్‌ ట్రెయిల్స్‌ని 5 రోజుల ప్లాన్‌ లో కవర్‌ చేయాలి అంటే ఎక్కువగా విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి స్టార్ట్‌ చేస్తే విమాన చార్జీలు,  వసతి, భోజనం,  రవాణా, ప్రవేశ రుసుము కలిపి బడ్జెట్‌ ట్రావెల్‌ కోసం సుమారు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు అవసరం పడవచ్చు.

  • కంఫర్టబుల్‌ స్టాండర్డ్‌ ట్రావెల్‌ కోసం రూ.50 వేల నుంచి రూ.70 వేల మధ్య ప్లాన్‌ చేసుకోవచ్చు. ప్రీమియం ట్రావెల్‌ అనుభూతి కోసం రూ.80 వేలపైనే బడ్జెట్‌ అవసరం అవుతుంది.

  • విజయవాడ నుంచి ప్రయాణం చేస్తే కనెక్టివిటీని బట్టి కొంచెం వేరియేషన్‌ ఉంటుంది. స్టే కోసం ప్రతి డెస్టినేషన్‌ లో సుమారు రూ.1500 నుంచి రూ.4000 వరకు ఖర్చు అవుతుంది. ఫుడ్‌ కోసం రోజుకు రూ.300 నుంచి రూ.1500 వరకు మీ ఛాయిస్‌ను బట్టి ఖర్చు చేయవచ్చు.

ఈ ఫ్రీడమ్‌ ట్రెయిల్‌లో ఆసక్తికర విశేషాలు...

  • సెల్యులర్‌ జైల్‌ని బ్రిటిష్‌ కాలంలో కాలాపానీ అని పిలిచేవారు.

  • అల్లూరి సీతారామ రాజుని తెలుగులో ప్రజలు మన్యం వీరుడు అని గౌరవిస్తారు.

  • దాండీ మార్చ్‌ను మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి పారంభించారు.

  • జలియన్‌ వాలా బాగ్‌ ఘటన భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక మలుపు లాంటిది.

  • నేతాజి భవన్‌ లో సుభాష్‌ చంద్రబోస్‌ జీవితానికి సంబంధించిన అరుదైన విషయాలు తెసుకోవచ్చు.

– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement