బంగారం, వెండి ధరలు గత వారం రోజుల్లో భారీగా పెరిగాయి. ఇది వచ్చే వారం కూడా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటి?, ఎంతవరకు ధరలు పెరగనున్నాయి?, అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ద్రవ్యోల్బణ గణాంకాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న పాజిటివ్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1.57 లక్షలు, వెండి ధర కేజీ రూ.2.80 లక్షల వరకు చేరే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణుడు ప్రణవ్ మేర్ అంచనా వేశారు.
దేశీయ మార్కెట్లో పసిడి ధరలు.. ఈ వారంలో దాదాపు 6 శాతం పెరిగి రూ.1.51 లక్షలకు చేరింది. వెండి రూ.2.49 లక్షలకు చేరింది. అమెరికా కార్మిక మార్కెట్.. అంచనాల కంటే బలహీనంగా ఉండటంతో.. అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కొంత సడలింపు చూపించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. దీంతో బంగారం, వెండిపై కొనుగోళ్లు పెరిగాయి. మరోవైపు డాలర్ బలహీనపడటం కూడా ధరలు పెరగడానికి కారణం అవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బంగారం ధర దాదాపు 7 శాతం పెరగగా.. వెండి ఏకంగా 10 శాతం వరకు ఎగబాకింది. వచ్చే వారం అమెరికా ఆర్థిక గణాంకాలతో పాటు అమెరికా - ఇరాన్ మధ్య పరిణామాలు కూడా కీలకం కానున్నాయి. పశ్చిమాసియాలో ఏదైనా అనూహ్య పరిణామం చోటుచేసుకుంటే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలంటే.. ఎవరు ఏ వీసా తీసుకోవాలి?


