ఫతేగఢ్ సాహిబ్: జైలులో ఉన్న ఖాదూర్ సాహిబ్ ఎంపీ, సిక్కు నేత అమృత్పాల్ సింగ్ పార్టీ ‘అకాళీదళ్ (వారిస్ పంజాబ్ దే)’ 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య కేసులో కుట్ర కోణంలో దోషిగా తేలి ఉరిశిక్షను ఎదుర్కొన్న కేహార్ సింగ్ కుమారుడు సత్వంత్ సింగ్ను బస్సీ పఠానా నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతున్నట్లు వెల్లడించింది. అమృత్పాల్ సింగ్ తండ్రి, డబ్ల్యూపీడీ తాత్కాలిక అధ్యక్షుడు తర్సేమ్ సింగ్, ఫరీద్కోట్ ఎంపీ సరబ్జిత్ సింగ్ ఖల్సాలతో కలిసి అమృత్సర్లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు.
ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని బస్సీ పఠానా నియోజకవర్గానికి చెందిన 61 ఏళ్ల సత్వంత్ సింగ్ రిటైర్డ్ బ్యాంక్ అధికారి. ఆయన ఈ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తర్సేమ్ సింగ్ మాట్లాడుతూ.. తమ పార్టీ అజెండా కేవలం రాజకీయ అధికారాన్ని సాధించడం మాత్రమే కాదని పంజాబ్ హక్కులు, సమాజం కోసం త్యాగాలు చేసిన కుటుంబాల సేవలను గుర్తించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో త్యాగం చేసిన కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకే సత్వంత్ సింగ్కు టికెట్ కేటాయించినట్లు తెలిపారు. అంతేకాకుండా, పార్టీ పార్లమెంటరీ బోర్డులో సత్వంత్ సింగ్ మేనల్లుడు సుఖ్విందర్ సింగ్ అగ్వాన్కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.
గత 2024 లోక్సభ ఎన్నికల్లో బీయంత్ సింగ్ కుమారుడు సరబ్జిత్ సింగ్ ఖల్సా ఫరీద్కోట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందగా, అమృత్పాల్ సింగ్ ఖాదూర్ సాహిబ్ నుంచి భారీ విజయం సాధించారు. తాజాగా సత్వంత్ సింగ్ అభ్యర్థిత్వం ద్వారా పంజాబ్ రాజకీయాల్లో రాడికల్ భావజాలం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రాంతీయ హక్కులు, సిక్కు రాజకీయ ఖైదీల కుటుంబాల ప్రాతినిధ్యమే తమ ఎన్నికల ప్రధాన అజెండా అని పార్టీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: యువతపై దౌర్జన్యం సరికాదు: ప్రకాశ్ రాజ్


