పనిమనిషి హత్య.. ఇంటిపై నాటు బాంబులతో దాడి | Maid assassinated in Chittoor district | Sakshi
Sakshi News home page

పనిమనిషి హత్య.. ఇంటిపై నాటు బాంబులతో దాడి

Aug 9 2026 5:01 AM | Updated on Aug 9 2026 5:01 AM

Maid assassinated in Chittoor district

పెంపుడు కుక్కలకు మత్తుమందు ఇచ్చి దుండగుల ఘాతుకం  

చిత్తూరు జిల్లాలో ఘటన  

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు పంచాయతీ పరిధిలోని మంగాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు పెంపుడు కుక్కలకు మత్తుమందు ఇచ్చి, పనిమనిషిని గొంతుకోసి హతమార్చడమే కా­కుండా నాటు బాంబులతో కలకలం సృష్టించా­రు.  

బీఎన్‌ఆర్‌పేట ఎస్‌ఐ మణికంఠేశ్వర్‌రెడ్డి కథనం ప్రకారం.. మంగాపురం గ్రామానికి చెందిన పట్టాభి­నాయుడు అమెరికాలో ఉంటున్నారు.ఆ ఇంట్లో ఆ­యన సోదరి, ఆమె భర్తతోపాటు పనిమనిషి ఆనందరావు(50) ఉంటున్నారు. బాపట్ల జిల్లా చుండూ­రు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన ఆనందరావు ఇక్కడ 11ఏళ్లుగా పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు, ముందుగా ఇంట్లోని పెంపుడు కుక్కలకు మత్తుమందు ఇచ్చి అచేతనంగా మార్చారు. ఆ తర్వాత ఇంట్లో ఆనందరావును అడ్డగించి గొంతు కోసి హత్య చేశారు. 

నాటు బాంబుల మోత...  
హత్య అనంతరం దుండగులు ఇంటి కిటికీ అద్దాల­ను ధ్వంసం చేసేందుకు నాటు బాంబులను పేల్చా­రు. పెద్ద ఎత్తున బాంబు పేలుడు శబ్దాలు రావడంతో ఇంట్లోని వారు అరుపులు కేకలు పెట్టారు. దీంతో గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ఘటన స్థలంతో పాటు రోడ్డులో రెండు నాటు బాంబులను స్వాదీనం చేసుకున్నారు. ఆనందరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

వెల్లువెత్తుతున్న అనుమానాలు 
హత్యకు గురైన ఆనందరావు గత 11 ఏళ్లుగా పట్టాభినాయుడు ఇంట్లోనే నమ్మకంగా పనిచేస్తున్నాడు. యజమాని ఆర్థిక సహాయంతోనే ఆనందరావు తన కుమారుడిని పుత్తూరులోని ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదివిస్తున్నాడు. ఆనందరావు భార్య, కుమార్తె బాపట్ల జిల్లాలోని సొంత ఊరి­లోనే ఉంటున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రా­మంలో బాంబులు పేల్చి మరి హత్యకు పాల్పడడం వెనుక అసలు కారణాలు ఏమిటి? కేవలం పనిమ­నిషినే లక్ష్యంగా చేసుకుని దాడి చేశారా? లేక ఇంటి యజమానులను భయపెట్టేందుకు ఏమైనా ముఠా పన్నాగమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement