చంద్రగిరి : గ్రామీణ ప్రాంతాల పురుషులకు చంద్రగిరిలో ఈ నెల 13వ తేదీ నుంచి 14 రోజుల పాటు సీసీ కెమెరా, సెక్యూరిటీ అలారమ్, స్మోక్ డిటెక్టర్పై ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పురుషులు శిక్షణకు అర్హులని వెల్లడించారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. శిక్షణ సమయంలో ట్రైనీస్కి ఉచిత భోజనంతో పాటు హాస్టల్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఆధార్, రేషన్ కార్డు, ఎడ్యుకేషన్ ధ్రువీకరణపత్రం జిరాక్స్లతోపాటు 4 పాస్దృవీకరణ పత్రం జెరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట , చంద్రగిరి. ఫోన్: 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లతో సంప్రదించాలని పేర్కొన్నారు.
ఆక్రమణపై ఆవేదన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మా ప్రభుత్వం.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారని బంగారుపాళ్యం మండలం శేషాపురం గ్రామానికి చెందిన గాయత్రి ఆరోపించారు. శనివారం చిత్తూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆమె మాట్లాడుతూ తమ స్థలం ఆక్రమణపై ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి స్థలాన్ని అదే గ్రామానికి చెందిన దీనయ్య, మంజుల, హేమావతి, రాజేశ్వరి, మోహన్ కబ్జా చేశారని వాపోయారు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరని కులం పేరుతో దూషించారని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆక్రమణదారుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు.


