పుత్తూరు: పట్టణంలోని కామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి ఆలయ పుష్కరిణి వద్ద షాపింగ్ కాంప్లెక్స్లోని రెండు గదులను శుక్రవారం రాత్రి కూల్చి వేశారు. దీనిపై దేవదాయ శాఖ అధికారులు మా ట్లాడుతూ పుష్కరిణి ముందు సిమెంట్ రోడ్డు, డ్రైనే జీ నిర్మాణం కోసం ఒక గదిని తొలగించాలనుకున్నామని, దీనిపై మరో గది ఉండడంతో రెండింటినీ పడగొట్టామని వెల్లడించారు. పైగా షాపింగ్ కాంప్లెక్స్ ఆర్అండ్బీ స్థలంలో ఉందని తెలిపారు.
వాస్తవం ఏమిటంటే..!
కామాక్షీ సమేత సదాశివేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా పట్టణ నడిబొడ్డున కోనేరు (పుష్కరిణి) ఉంది. దీనికి నాలుగు వైపులా వ్యాపార సముదాయాలు ఉన్నాయి. 2006లో అప్పటి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు కోనేరుతో పాటు వ్యాపార సముదాయాలను తొలగింపునకు చర్యలు చేపట్టారు. 2016లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. కోనేరును పునర్నిర్మించాలని 2023లో అప్పటి మంత్రి ఆర్కే రోజా పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం దేవదాయ శాఖ ద్వారా రూ.25 లక్షలు మంజూరు చేయించారు. రూ.5 లక్షల విరాళాలను సేకరించారు. మొత్తం నిధులతో పుష్కరిణి నిర్మాణ పనులను నాటి మంత్రి రోజా ప్రారంభించారు. అలాగే గతంలో వ్యాపా ర గదులు పోగొట్టుకున్న వారి కోసం కోనేరు చుట్టూ ఎల్ షేప్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను రూ.60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టారు. దీనికి పలువురు ముందుకు రావడంతో జీప్లస్ వన్తో మొత్తం 40 గదులకు పనులు పెరిగాయి. పుష్కరిణితో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కోర్టు ద్వారా స్టే తెచ్చి పనులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా పుష్కరిణి పనులు పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పేరిట షాపింగ్ కాంప్లెక్స్లోని గదులను కూల్చి వేశారు. నిర్మాణాలు చేపట్టలేరు కానీ, కూల్చడానికి మాత్రం సిద్ధం ఉంటారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.


