రాంచీ: జార్ఖండ్లోని రాంచీలో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల అవకతవకలపై జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ , జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లోని లోపాలను సవరించాలని, సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన విధానసభ ముట్టడి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ, బాష్పవాయువు, వాటర్ కేనాన్లను ప్రయోగించారు. ఈ పోలీసు చర్యను ఖండిస్తూ, ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ బంద్లోనూ నిరసనకారులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
🚨 Ranchi, Jharkhand: Thousands of students marching towards the Assembly were reportedly subjected to lathi-charge, tear gas and water cannons as police attempted to stop them. Students have been protesting for 17 days. pic.twitter.com/z0ts09LB5I
— indiainlast24hr (@indiain24hr) August 10, 2026
బంద్ ప్రభావం రాజధాని రాంచీలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆందోళనకారులు రోడ్లపై బైఠాయించి, టైర్లు కాల్చి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఫలితంగా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. బంద్ను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాల్లో ప్రైవేట్ పాఠశాలలను కూడా మూసివేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పరిస్థితిని అదుపు చేయడానికి రాంచీలో దాదాపు రెండు వేల మంది పోలీసులను మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను రంగంలోకి దించారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కొడర్మా, దుమ్కా, గఢ్వా తదితర ప్రాంతాల్లోనూ బీజేపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి దుకాణాలను బంద్ చేయించారు. రాంచీలోని కిశోర్గంజ్ చౌక్, హర్ము చౌక్, భారత్ మాతా చౌక్ వద్ద ఆందోళనకారులు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రత్యేక నిఘా ఉంచింది.
అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)ఆధ్వర్యంలో రాంచీలో పాత అసెంబ్లీ నుంచి కొత్త అసెంబ్లీ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులు, ఉద్యోగార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యాన్సన్లను ప్రయోగించిన మరుసటి రోజే ఏబీవీపీ ఈ మార్చ్ను చేపట్టడం గమనార్హం.


