హరారే: జింబాబ్వేలోని కరిబా సరస్సులో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే ఈ విషాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో మరో 27 మంది గల్లంతయ్యారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం.. సుమారు 114 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో బయలుదేరిన ఈ ఫెర్రీ (పడవ) సరస్సులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అయితే, టికెట్ తీసుకోని పిల్లలు కూడా ఉండవచ్చని, దీనివల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సివిల్ ప్రొటెక్షన్ యూనిట్ హెచ్చరించింది. ఈ పడవ గరిష్ఠ సామర్థ్యం 90 మంది మాత్రమే కావడం గమనార్హం.
ప్రమాదం జరిగిన వెంటనే 77 మంది ప్రయాణికులు సమీపంలోని ఒక చిన్న ద్వీపానికి చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు స్పీడ్ బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద ప్రాంతంలో హెలికాప్టర్లు, నీటి అడుగున శోధించే బృందాలను రంగంలోకి దింపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సివిల్ ప్రొటెక్షన్ యూనిట్, దీన్ని అధికారికంగా ‘విపత్తు’గా ప్రకటించాలని సిఫార్సు చేసింది. కాగా కరిబా సరస్సు ఆఫ్రికాలోని అతిపెద్ద మానవ నిర్మిత సరస్సులలో ఒకటి. సుమారు 200 కిలోమీటర్ల పొడవు, 40 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ సరస్సుపై గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఐదు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో పడవ బోల్తా పడటానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. పడవ బయలుదేరే సమయంలోనే స్థానికులు ఆందోళన వ్యక్తం చేసినట్లు స్థానిక ఎంపీ ముత్సా మురోంబెడ్జీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: బలూచ్కు భారత్ మద్దతు.. ఉలిక్కిపడిన పాక్!


