నేడు జింబాబ్వేతో రెండో టి20
సాయంత్రం గం. 4:30 నుంచి యునైట్ 8 స్పోర్ట్స్ చానెల్, ఫ్యాన్ కోడ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం
హరారే: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు తొలి టి20 సిరీస్ సాధించేందుకు విజయం దూరంలో ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత జట్టుకు ఒక్క గెలుపు కూడా దక్కలేదు. జింబాబ్వేతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియా అలవోక విజయం అందుకుంది. అదే జోరును రెండో మ్యాచ్లోనూ కొనసాగించాలని శ్రేయస్ అయ్యర్ బృందం పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంటుంది.
తొలి మ్యాచ్లో టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు బ్యాటింగ్తో అర్ధ సెంచరీ సాధించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమైనా... ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణించి భారత్కు 40 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కట్టబెట్టారు. మరోవైపు జింబాబ్వే జట్టుకు బ్యాటర్లు ఆశించిన స్కోరును అందించలేకపోయారు. కెప్టెన్ సికందర్ రజాతోపాటు బెన్ కరన్, బ్రియాన్ బెనెట్, డియాన్ మైర్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.
ర్యాన్ బుర్ల్, వెస్లీ మధెవెరె, మరుమని కాస్త పోరాడటంతో జింబాబ్వే స్కోరు 100 దాటగలిగింది. జింబాబ్వే బౌలర్లు ముజరబాని, ఎన్గరావా ఫర్వాలేదనిపించినా.. జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యం తక్కువగా ఉండటంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో నిలవాలంటే అటు బ్యాటింగ్తోపాటు ఇటు బౌలింగ్లో జింబాబ్వే రాణించాల్సి ఉంటుంది.


