ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గోశాలల ఆర్థిక స్వావలంబన, ఆయుర్వేద రంగ ప్రోత్సాహం లక్ష్యంగా గోమూత్ర సేకరణ పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రభుత్వ, స్వచ్ఛంద గోశాలల నుంచి గోమూత్రాన్ని సేకరించి ప్రాసెసింగ్ ద్వారా ఆయుర్వేద ఔషధాలు, ప్రాకృతిక ఎరువులు, క్రిమిసంహారకాల తయారీకి ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. గోవుల సంరక్షణ భారాన్ని తగ్గించి గోశాలలను స్వయంసమృద్ధి కేంద్రాలుగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
రైతులు, పశుపోషకుల నుంచి లీటర్ గోమూత్రాన్ని రూ.10 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. (భవిష్యత్తులో ఈ ధరను లీటరుకు రూ.20కి పెంచే ప్రతిపాదన కూడా ఉంది). అయితే, ఈ ప్రాజెక్ట్పై ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. రాష్ట్రంలో నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్న వీధి పశువుల తీవ్ర సమస్యను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి పథకాలను తెరపైకి తెస్తోందని సమాజ్వాదీ పార్టీ విమర్శించింది. మౌలిక వసతులు, ఉపాధి వంటి కీలక అంశాలను పక్కనపెట్టి గోమూత్ర సేకరణపై దృష్టి సారించడం పాలనా ప్రాధాన్యతల లోపానికి నిదర్శనమని ఆరోపించింది.
ఆర్థిక సంస్కరణా?
విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గో ఆధారిత ఉత్పత్తులను (పంచగవ్య) వాణిజ్యపరంగా ప్రోత్సహించడం ఒక వైపు సాంప్రదాయ విధానమే అయినా, దాని అమలు తీరుపై అనేక సవాళ్లు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. సేకరించిన గోమూత్రానికి నాణ్యతా ప్రమాణాలు పాటించడం, శాస్త్రీయ శుద్ధి, సక్రమమైన మార్కెటింగ్ నెట్వర్క్ ఏర్పరచడం ప్రాజెక్ట్ విజయానికి అత్యంత కీలకం.
ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు!


