గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ ఐటీ ఉద్యోగులకు మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి వేగంగా మళ్లుతున్న వేళ వ్యయ నియంత్రణే లక్ష్యంగా మరో విడత భారీ ఉద్యోగాల తొలగింపునకు ప్రణాళికలు రచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే (మే 31 నాటికి) కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతం మందికి (సుమారు 21,000 మంది) లేఆఫ్స్ ప్రకటించింది. దీనివల్ల ఒరాకిల్ ప్రపంచవ్యాప్త సిబ్బంది సంఖ్య 1,62,000 నుంచి 1,41,000కు పడిపోయింది. ఈ కోతలకు పునర్వ్యవస్థీకరణ ఖర్చుల కింద కంపెనీ ఏకంగా 1.8 బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది.
సెప్టెంబరు నాటికి మరో విడత సిద్ధం!
తాజా నివేదికల ప్రకారం, కంపెనీ మేనేజర్లకు నోటీసులు అందిస్తూ బాధితుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 1 నాటికల్లా కొన్ని విభాగాల్లో డబుల్ డిజిట్ (10 శాతానికి పైగా) స్థాయిలో ఉద్యోగులకు గుడ్బై చెప్పేందుకు ఒరాకిల్ ప్రణాళిక రూ పొందించినట్లు సమాచారం.
ఏఐ రేసులో భారీ పెట్టుబడులు
ఈ భారీ లేఆఫ్స్కు ప్రధాన కారణం కంపెనీ ఏఐ మౌలిక సదుపాయాల కోసం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్సే. ఎన్విడియా ప్రాసెసర్లు, ఆధునిక డేటా సెంటర్ల నిర్మాణానికి ఒరాకిల్ బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల కోసం ఒరాకిల్ గతంలో 43 బిలియన్ డాలర్ల రుణాలు స్వీకరించింది. దాంతో కంపెనీ మొత్తం అప్పు 129.5 బిలియన్ డాలర్లకు చేరుకోగా డేటా సెంటర్ లీజులు 260 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
ఏఐ వల్లే ఇదంతా..
ఒరాకిల్ ఇటీవలే అమెరికన్ మార్కెట్ రెగ్యులేటర్ ఎస్ఈసీకి సమర్పించిన వార్షిక నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. కంపెనీ అంతర్గత నిర్వహణలో కృత్రిమ మేధ సాంకేతికతల వాడకం విస్తరించడం వల్లే సిబ్బంది తగ్గించాల్సి వస్తోందని చెప్పింది. భవిష్యత్తులోనూ ఇది కొనసాగవచ్చని అంగీకరించింది.
ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు!


