ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల రాబోయే రోజుల్లో.. భారతదేశంలో ఉద్యోగాల తీరు చాలా వరకు మారే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నీలేకని అన్నారు. ముఖ్యంగా పెద్ద కంపెనీల్లో ఏఐ, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
నిజానికి.. ఒక ఉద్యోగి చేసే పనిని చిన్న చిన్న టాస్కులుగా విభజించి వాటిలో కొన్నింటిని ఏఐతో చేయించుకోవడం పెద్ద సంస్థలకు సులభంగా ఉంటుంది. కాబట్టి.. భవిష్యత్తులో పెద్ద కంపెనీలు ఉద్యోగాలు కల్పించడం కంటే, ఉద్యోగాలను తొలగిస్తాయని నీలేకని అభిప్రాయపడ్డారు.
అయితే.. చిన్న కంపెనీల పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంటుందని నీలేకని అన్నారు. దేశంలో లక్షల సంఖ్యలో చిన్న సంస్థలు ఉన్నాయి. ఇందులో పనితీరు, అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల వాటి మొత్తం కార్యకలాపాలను ఏఐతో ఆటోమేట్ చేయడం అంత సులభమైన విషయం కాదు. కాబట్టి చిన్న వ్యాపారాలు.. ఏఐ ప్రభావాన్ని కొంతవరకు తట్టుకుని నిలబడగలవు, ఉద్యోగాలను కల్పించగలవని ఆయన అన్నారు.
ప్రస్తుతం దేశంలో సుమారు 1.5 లక్షల స్టార్టప్లు ఉన్నాయి. 2035 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు చేరే అవకాశం ఉందని నీలకేని అంచనా వేశారు. అయితే.. చిన్న వ్యాపారాలు పెరగాలంటే నిబంధనలు సులభంగా ఉండాలని, వారికి పెట్టుబడులు, రుణాలు, మార్కెట్లు సులభంగా అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు ఉద్యోగుల విషయంలోనూ పరిస్థితులు మారుతున్నాయని చెప్పారు. ఒక కంపెనీలో చేరి ఏళ్ల పాటు అక్కడే పనిచేసే రోజులు క్రమంగా తగ్గిపోతున్నాయని, భవిష్యత్తులో ఉద్యోగులు తరచుగా కంపెనీలు మారే పరిస్థితి రావచ్చని అన్నారు.
ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందా?


