సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వేదికగా భారత్లో తన నాలుగో క్లౌడ్ కేంద్రాన్ని ప్రారంభించింది. సాంకేతిక రంగంలో అత్యంత ప్రాధాన్యంగల ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత భారీ డేటా కేంద్రాల నెట్వర్క్గా రూపుదిద్దుకోనుందని కంపెనీ గురువారం ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ తన డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం సుమారు రూ. 1.70 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. ఈ పెట్టుబడిలో భాగంగా కేవలం హైదరాబాద్ క్లౌడ్ కేంద్రంలో మౌలిక సదుపాయాల కోసమే వచ్చే 15 ఏళ్లలో రూ. 15,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని సంస్థ నిర్ణయించింది.
2 కోట్ల మందికి ఏఐలో శిక్షణ..
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ సరికొత్త కేంద్రానికి ఇండియా సౌత్ సెంట్రల్ అని నామకరణం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ సర్వర్ల వేడిని తగ్గించడానికి గాలి ఆధారిత శీతలీకరణ పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టారు. దీనివల్ల ఒక్క చుక్క నీరు కూడా వృథా కాదు. ఈ కేంద్రాల నిర్వహణకు అవసరమైన విద్యుత్ కోసం దేశవ్యాప్తంగా 1,000 మెగావాట్ల సామర్థ్యంగల సౌర, పవన విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వ్యాపార విస్తరణతోపాటు 2030 నాటికి 2 కోట్ల మంది భారతీయులకు ఏఐ రంగంలో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.


