హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ దూసుకుపోతున్న వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త! తమను ఎవరూ గమనించడం లేదని నిత్యం నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ చలానాలు జనరేట్ చేయడానికి ఏఐ కెమెరాలు వచ్చేశాయి. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 అల్కజార్ మాల్ వద్ద, రోడ్ నెం. 36లోని కృష్ణా జ్యువెలర్స్ వద్ద, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1లోని టీవీ5 వద్ద ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశారు. గత ఏప్రిల్ 18వ తేదీన జూబ్లీహిల్స్లోని మూడు ప్రాంతాలతో పాటు నగరంలో మొత్తం 32 చోట్ల ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ మూడు ఏఐ కెమెరాలు ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ వెళ్లిన 6 లక్షల 34 వేల 67 మంది వాహనదారులకు చలానాలు జనరేట్ చేశాయి. హెల్మెట్ ధరించకున్నా, రాంగ్రూట్లో వెళ్ళినా, సెల్ఫోన్ డ్రైవింగ్ చేసినా ఈ ఏఐ కెమెరాలు పట్టేస్తాయి. వెంటనే ఆ ఫొటోలు క్యాప్చర్ చేసి చలానాలు జనరేట్ చేస్తాయి. ఒకేసారి ఆ కెమెరా నుంచి వంద మంది పోయినా ఆ వాహనాల ఫొటోలను స్పష్టంగా తీస్తాయి. ఒక్కో కెమెరా రోజుకు 3 వేలకుపైగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వాహనాల ఫొటోలు, ఆ వెంటనే చలానాలనూ జనరేట్ చేస్తోంది.
త్వరలో మరో 50 ప్రాంతాల్లో..
ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఉన్న 32 ఏఐ కెమెరాలకు తోడు త్వరలోనే మరో 50 చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ విభాగం ప్రతిపాదనలు రూపొందించింది. ఇవి కూడా ఏర్పాటు చేస్తే తమను ఎవ్వరూ గమనించడం లేదని రూల్స్ ఉల్లంఘించే వాహనదారులకు చుక్కలు చూపించనున్నాయి. ప్రస్తుతం 60 శాతానికి పైగా రాంగ్రూట్ కేసులు తగ్గాయని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ రవీందర్ తెలిపారు.


