ఉత్తర తెలంగాణకు చెందిన నలుగురు పార్టీ అధ్యక్షులను మార్చే యోచనలో అధిష్టానం
ఇటీవల ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చ
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారినే టార్గెట్ చేశారంటున్న డీసీసీ అధ్యక్షులు
సంగారెడ్డి, రంగారెడ్డి, రామగుండం టౌన్ అధ్యక్షుల నియామకానికి పరిశీలకుల నియామకం
అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులకు ర్యాంకింగులిచ్చిన అధిష్టానం
సాక్షి, హైదరాబాద్: నియామకాలు జరిగి నిండా సంవత్సరం కాకముందే జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) అధ్యక్షులను మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉత్తర తెలంగాణకు చెందిన నలుగురు డీసీసీ అధ్యక్షుల పనితీరు బాగాలేదని ఏఐసీసీకి నివేదికలు వెళ్లిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో డీసీసీ అధ్యక్షుల పనితీరుపై చర్చ జరిగిందని, ఈ చర్చలో ఏఐసీసీ అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారని, ఇందుకు సమన్వయ కమిటీ కూడా అంగీకారం తెలిపిందని సమాచారం. దీంతో త్వరలోనే డీసీసీ అ«ధ్యక్షుల మార్పులుంటాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
సమన్వయం ఏదీ?
సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని అందరు డీసీసీ అధ్యక్షుల పనితీరు మదింపు నివేదికలను మీనాక్షి ప్రవేశపెట్టారు. జిల్లాల వారీగా పలు సూచికల ఆధారంగా ర్యాంకింగులిచ్చిన ఆమె.. కొందరి పనితీరు బాగాలేదని సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సమక్షంలోని కమిటీ దృష్టికి తెచ్చారు. ఈ జాబితాలో మహిళలతోపాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు తెలిసింది. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నిర్వహించడంలో, జిల్లాలోని పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో వీరు విఫలమవుతున్నారని, ఏఐసీసీకి తగిన సమాచారం ఇవ్వడం లేదని ఆమె సమన్వయ కమిటీ దృష్టికి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలోనే సమన్వయకమిటీ అంగీకారం మేరకు త్వరలోనే ఆ ముగ్గురు లేదా నలుగురు డీసీసీ అధ్యక్షుల మార్పు ఉంటుందని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి.
తమ విషయంలో సామాజిక అన్యాయం జరుగుతోందని కొందరు డీసీసీ అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. అగ్రవర్ణాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల పనితీరుపై ఎలాంటి సమీక్ష ఎందుకు జరపడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన తమ పనితీరును మాత్రమే ఎందుకు లెక్కగడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని నేతలందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని, కొందరు రావడం లేదని, వారితో సఖ్యత కుదరడం లేదని, ఈ విషయంలో టీపీసీసీ, ఏఐసీసీలు ఎలాంటి చొరవ తీసుకోకుండా తాము కలుపుకొని పోవడం లేదని అనడంలో అర్థం లేదని వారంటున్నారు.


