మాట్లాడుతున్న కోమటిరెడ్డి. చిత్రంలో వివేక్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
మైనింగ్ సమస్యలపై మంత్రి వివేక్తో కలిసి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్న చిన్న కాంట్రాక్టర్లను మైనింగ్ నిబంధనల పేరిట భారీ పెనాల్టీలు విధించి వేధించడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. రూ.5 కోట్ల విలువ చేసే పనికి రూ.54 కోట్ల పెనాల్టీ విధించడం దుర్మార్గమన్నారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుక్రవారం సచివాలయంలో మైనింగ్ విభాగంపై సమీక్షించారు. మైనింగ్ విభాగానికి సంబంధించిన సమస్యలు, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ సమీక్షలో చర్చించారు.
ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, టీజీఎండీసీ ఎండీ అనుదీప్ దురిశెట్టి, రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ బీవీ రావు, మైనింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.
రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్న చిన్న కాంట్రాక్టర్లపై భారీగా పెనాల్టీలు విధించడం, మెటల్ పర్మిషన్ల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, నిర్మాణ సామగ్రి లభ్యతలో ఎదురవుతున్న సమస్యలను వివరించారు. మైనింగ్ అధికారుల వేధింపుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్యకు కారణమైన అధికారిపై చర్య లు తీసుకోవాలని మంత్రి కోరారు. హ్యామ్ రోడ్ల కోసం గ్రీన్ చానల్: హ్యామ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులు వేగంగా వచ్చేలా గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.


