సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ఆసుపత్రుల సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: ఆసుపత్రుల నుంచి బయోమెడికల్ వ్యర్థాల సేకరణ, నిర్వహణకు సంబంధించి యాజమాన్యాల నుంచి బెడ్ల (పడకల) సంఖ్య ఆధారంగా ఫీజులు వసూలు చేస్తున్న విధానంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఆసుపత్రుల్లోని బెడ్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఫీజులు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
ఆసుపత్రుల బయోమెడికల్ వ్యర్థాల పారబోతకు సంబంధించి 2016లో రూపొందించిన నిబంధనల ప్రకారం.. ప్రతి 75 కిలోమీటర్ల పరిధిలోని ఆసుపత్రులన్నీ తమ వ్యర్థాల నిర్వహణను ప్రభుత్వం నిర్దేశించిన ఒక ఉమ్మడి ప్రైవేటు సంస్థకు (సీబీడబ్లూటీఎఫ్) అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆసుపత్రులు తమ వ్యర్థాలను పసుపు, ఎరుపు, నీలం తదితర రంగుల సంచుల్లో వేరుచేసి సదరు సంస్థకు ఇవ్వాలి. అయితే, ఆ వ్యర్థాల పరిమాణం, బ్యాగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా.. ఆసుపత్రిలోని మొత్తం బెడ్ల సంఖ్య ఆధారంగా ఫీజులను వసూలు చేస్తుండటాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.


