న్యూఢిల్లీ,సాక్షి: దేశ రాజధాని ఢిల్లీలో వర్షం దంచికొడుతుంది. కురిసిన భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో వాతావరణ శాఖ రాత్రి 11 గంటల వరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
వర్షం నిరంతరం కురుస్తుండటంతో అనేక మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. క్యాబ్లు గంటల తరబడి అందుబాటులో లేకపోవడంతో పలువురు కార్యాలయాల్లోనే చిక్కుకుపోయారు. ఇంటికి బయలుదేరిన వారు కూడా భారీ ట్రాఫిక్లో చిక్కుకున్నారు. మెహ్రౌలి-బడర్పూర్ రోడ్, వజీరాబాద్ రోడ్, పటేల్ రోడ్, రోహ్తక్ రోడ్, శంకర్ రోడ్, కిర్తి నగర్, ఢిల్లీ-జైపూర్ హైవే, పీరాగఢి, షాహీన్ బాగ్ వంటి కీలక మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
నిరంతర వర్షాల కారణంగా ఛత్తర్పూర్ ఫార్మ్ ప్రాంతం,టెర్మినల్-1 సమీపంలోని మెహ్రామ్ నగర్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఢిల్లీ-జైపూర్ హైవేలోని శంకర్ విహార్ వద్ద వాహనాలు భారీ క్యూల్లో నిలిచిపోయాయి. అలాగే గురుగ్రామ్ నుంచి ధౌలా కువాన్ వెళ్లే మార్గంలో కూడా పలుకిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నమోదైంది.
ఇక నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై కూడా తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. తూర్పు ఢిల్లీలోని శకర్పూర్, మండావలి ప్రాంతాల్లో కాలువలు పొంగిపొర్లడం, గుంతలు నీటిలో మునిగిపోవడంతో ప్రమాదాలు పెరిగాయని ఈ-రిక్షా డ్రైవర్లు తెలిపారు. నీటిలో కనిపించని గుంతలు, మ్యాన్హోల్ల కారణంగా ఈ-రిక్షాలు, స్కూటర్లు, మోటార్సైకిళ్లు సహా కనీసం మూడు నుంచి నాలుగు వాహనాలు బోల్తాపడ్డాయి.


