ఢిల్లీ: 'స్వాతంత్య్ర సమరయోధులు తుపాకీ గుళ్లను ఎదుర్కొన్నారు.. మీరు కోడిగుడ్లకే భయపడుతున్నారా?' అంటూ టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. మతపరమైన భావాలను దెబ్బతీశారనే ఆరోపణల కేసులో పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాలని ఎంపీకి కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహువా మోయిత్రా.. విచారణకు వెళ్తే తనపై కోడిగుడ్లపై దాడి చేస్తారని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇవాళ(శుక్రవారం) జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం పిటిషన్పై విచారణ చేపట్టింది. ఆమె విచారణను ఎదుర్కోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. విచారణకు హాజరయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతించాలని మోయిత్రా తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కోరారు. దీనిపై జస్టిస్ దత్తా స్పందిస్తూ.. "మీరు ఎంపీ అయినంత మాత్రాన ప్రత్యేక మినహాయింపు ఇస్తారా?" అంటూ వ్యాఖ్యానించారు. గతంలో మోయిత్రాపై గుడ్లు విసిరిన ఘటనలను శంకరనారాయణన్ ప్రస్తావిస్తూ.. ఆమె స్వయంగా హాజరైతే మళ్లీ అలాంటి ఘటన జరిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.
దీనిపై జస్టిస్ దత్తా స్పందిస్తూ.. ఎంపీగా ఉన్నవారు గుడ్లకు భయపడకూడదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మీపై గుడ్లు విసురుతారని ఎందుకు భయపడుతున్నారు? మన స్వాతంత్య్ర సమరయోధులు తమ ఛాతీపై తుపాకీ గుళ్లను ఎదుర్కొన్నారు" అని వ్యాఖ్యానించారు. దీంతో తన పిటిషన్ను ఉపసంహరించుకుంటానని శంకరనారాయణన్ కోరగా.. దానికి ధర్మాసనం అనుమతించింది.


