ఢిల్లీ: జంతర్మంతర్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జంతర్ మంతర్ను ఎందుకు మూసివేయొద్దు? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. నగరం మధ్యలో నిరసనలతో నగరాన్ని అతలాకుతలం చేయొద్దంటూ వ్యాఖ్యానించింది. జంతర్ మంతర్లో నిరసనకు అనుమతి కోరుతూ అఖిల భారతీయ దళిత క్రైస్తవ హక్కుల రక్షణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
'నగరాన్ని అనవసరంగా ఎందుకు బందీగా మార్చాలంటూ ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్ర స్థానంలో ఉన్న జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టకూడదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి ప్రదర్శనల వల్ల అనవసరంగా నగరం మొత్తాన్ని బందీగా మారుస్తున్నారని వ్యాఖ్యానించింది. అయితే ఇటువంటి ధర్నాల అనుమతికి సంబంధించిన నిర్ణయాన్ని ఆయా సందర్భాలను బట్టి ప్రభుత్వం, పోలీసులకే విడిచిపెట్టింది. అయితే, శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల పరిధిలోని అంశం కాబట్టి ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ అమిత్ మహాజన్ ధర్మాసనం పేర్కొంది.
పోలీసులు జూలై నుంచి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకుండా ఉన్నారని పిటిషనర్ వాదించారు. ఆగస్టు 8లోగా దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు జంతర్ మంతర్ నిరసన స్థలంగా ఉండాలా అనే అంశం పైనే విచారణ చేస్తోందన్న ఏఎస్జీ.. సెక్షన్ 144 అమలులో ఉంది. ఆగస్టు 15 సమీపంలో ఉండటంతో భద్రతా పెంచామని ఏఎస్జీ వివరణ ఇచ్చింది.


