సాక్షి, న్యూఢిల్లీ: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో సంచలనం సృష్టించిన బట్ట లింగయ్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అప్పటి గ్రామ సర్పంచ్ పోలెబోయిన లింగయ్యకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కింది కోర్టు విధించిన జీవితకాల శిక్షను సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టులో అప్పీల్ పెండింగ్లో ఉన్నందున ఆయన్ను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది.
ప్రత్యక్ష దాడికి పాల్పడలేదు
ఈ పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగిన సమయంలో లింగయ్య సర్పంచ్గా ఉన్నారని, మృతుడి భార్య వాంగ్మూలంలో ఆయన ప్రత్యక్షంగా దాడి చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ నేరుగా దాడి చేయకపోయినా నిందితులను రెచ్చగొట్టి హత్యకు పురికొల్పారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. దాడిలో పిటిషనర్ ప్రత్యక్ష పాత్ర లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ నేపథ్యం...: 2017 సెపె్టంబర్ 30 దసరా పండుగ రోజున అజీంపేటలోని జమ్మిచెట్టు వద్ద ఎస్సీ వర్గానికి చెందిన బట్ట లింగయ్య దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో నాటి సర్పంచ్ పోలెబోయిన లింగయ్య ప్రోద్బలంతో ఆయన అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సర్పంచ్తో సహా మొత్తం 18 మందికి జీవితఖైదు విధించింది. కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించినా, ఉపశమనం లభించకపోవడంతో మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


