సాక్షి, హైదరాబాద్: నాలుగు దక్షిణాది భాషల్లో ప్రతి ఏటా ఒక్కో భాషా సాహితీకారుడిని గౌరవించుకునే ఉద్దేశంతో ‘బుక్బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘బుక్బ్రహ్మ సాహితీ పురస్కారం’2026 సంవత్సరానికిగాను ప్రముఖ తెలుగు రచయిత మహమ్మద్ ఖదీర్బాబుకు ప్రక టించారు. ఈ మేరకు ఫెస్టివల్ డైరెక్టర్ సతీశ్ చప్పరికె ప్రకటన విడుదల చేస్తూ.. భారతీయ సాహిత్యానికి ఖదీర్బాబు చేసిన విస్తృత సేవకు ఈ పురస్కారం అందిస్తున్నట్టు తెలియచేశారు. బెంగళూరులో ఆగస్టు 20–23 తేదీల మధ్య నిర్వహిస్తున్న బుక్బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్లో ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు.
పురస్కారం కింద నగదు, జ్ఞాపిక ఉంటాయి. 2024లో ఈ పురస్కారం ప్రారంభించగా ఆ సంవత్సరం ప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ అందుకున్నారు. 2025 సంవత్సరానికి ప్రసిద్ధ మలయాళ రచయిత్రి కె.ఆర్.మీరా అందుకున్నారు. 2026 సంవత్సరానికి తెలుగు నుంచి మహమ్మద్ ఖదీర్బాబు ఎంపికయ్యారు. ఖదీర్బాబు.. దర్గామిట్ట కతలు’, ‘పోలేరమ్మ బండ కతలు’, ‘న్యూ బాంబే టైలర్స్’, ‘బియాండ్ కాఫీ’, ‘మెట్రో కథలు’, ‘దాహగీతి’.. కథా సంకలనాలు వెలువరించారు. ‘రైటర్స్ మీట్’స్థాపించి గత 25 సంవత్సరాలుగా యువ కథకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
‘కథలు ఇలా కూడా రాస్తారు’గ్రంథంతో ఎందరో రచయితలకు రచనా మెళకువలు చేరువ చేశారు. నవతరం పాఠకుల కోసం 150 తెలుగు కథలను రీటెల్లింగ్ చేశారు. ఖదీర్బాబు రెండుసార్లు జాతీయ కథా అవార్డు అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరో అందించే ప్రతిష్టాత్మక చార్లెస్ వాలెస్ ఫెలోషిప్ను దక్షిణాది నుంచి పొందిన తొలి రచయిత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు పొందారు. ఆయన సాక్షి దినపత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.


