పైలట్ ప్రాజెక్టుగా చేపట్టండి
టోల్ప్లాజాల వద్ద అయితే ఉత్తమం
కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాహనాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ లేకుండానే రోడ్లపై సంచరిస్తుండటం తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. సరైన బీమా పత్రాలు లేని వాహనాలకు పెట్రోల్ పంపుల్లో ఇంధనాన్ని నిరాకరించేలా ఓ పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. టోల్ ప్లాజాల మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు బీమా ఉందో లేదో ఆటోమేటిక్గా తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది.
ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికర్నిషన్ కెమెరాల వినియోగం ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొంది. బీమా లేని వాహనాలకు ఆటోమేటిక్ ఈ–చలాన్లు జారీ చేసేందుకు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, వాహన్ పోర్టల్ సమాచారంతో అనుసంధానించిన ఏఎన్పీఆర్ కెమెరాలను కొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.
పోలీసులకూ ఆ అధికారమివ్వాలి
సరైన బీమా పత్రాలు లేని వాహనాలకు ఏ పెట్రోల్ పంపులోనూ ఇంధనం నింపరాదని, సరైన ఇన్సూరెన్స్ పత్రాలను చూపే వరకు ఇదే నిబంధన అమలు కావాలని స్పష్టం చేసింది. దీనివల్ల ఇన్సూరెన్స్ లేని, రిజిస్టర్ కాని వాహనాలను గుర్తించడంతోపాటు, యజమానులు సరైన విధంగా బీమా చేయించుకునేలా ప్రోత్సహించినట్లవుతుందని ధర్మాసనం తెలిపింది. మోటారు వాహన చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ఇటువంటి ప్రాజెక్టులు ఉపయోగపడతాయని తెలిపింది. వాహనాల బీమా స్థితిని పరిశీలించే అధికారాన్ని రాష్ట్రాల పోలీసులకు కూడా ఇవ్వాలని, ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని కోరింది. దీనివల్ల అప్పటికప్పుడే బీమా లేని వాహనాలకు జరిమానా విధించడం, బీమా చేయించుకునేలా చేయడానికి వీలవుతుందని తెలిపింది.
ఇకపై నాలుగేళ్లు.. ఆరేళ్లు..!
కొత్త కార్లకు మూడేళ్లు, సెకండ్ హ్యాండ్ కార్లకైతే ఐదేళ్ల థర్డ్పార్టీ ఇన్సూరెన్స్ను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు 2018లో ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు కాకపోవడం ఆందోళనకరమని ధర్మాసనం పేర్కొంది. దేశంలోని మొత్తం 30.48 కోట్ల వాహనాలకు గాను 16.54 కోట్ల వాహనాలకు, 56 శాతం వరకు ఇన్సూరెన్స్ లేకపోవడం దిగ్భ్రాంతికరమంది. ఇకపై, కొత్త కార్లకు నాలుగేళ్లు, సెకండ్హ్యాండ్ కార్లకైతే ఆరేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను కొనుగోలు సమయంలోనే చేయించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయాలని ఐఆర్డీఏను ఆదేశించింది.
బీమా ఆప్షన్లు ఇవ్వాలి
మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్–146 కింద బీమా తప్పనిసరి నియమం కేవలం రోడ్డు ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందడమే కాదని, వారు సుదీర్ఘమైన కోర్టు కేసుల్లో చిక్కుకోకుండా చూడటం కూడా అని పేర్కొంది. వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ప్రమాద బాధితులు, వారి కుటుంబాలు తగిన సమయంలో సరైన నష్టపరిహారాన్ని పొందే వీలు లేకుండా పోతోందని ఆందోళన వెలిబుచి్చంది. మోటారు వాహనాల చట్టం కింద అవసరమైన కనీస బీమా రక్షణతో ఉండే బేస్ పాలసీతో పాటు, ప్రైవేట్ వాహన యజమానులకు యాడ్–ఆన్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ సహా పలు పాలసీ ఎంపికలను అందించాలని ఐఆర్డీఏను కోరింది. ఈ మేరకు ఒక మోటారు ప్రమాద పరిహార కేసులో విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.


