‘అయ్యా.. నేను ఐఏఎస్‌ తుకారాం ముండేని!’ | Who is Tukaram Mundhe.The Singham IAS Officer with 25 Transfers in 20 Years | Sakshi
Sakshi News home page

‘అయ్యా.. నేను ఐఏఎస్‌ తుకారాం ముండేని!’

Aug 4 2026 7:39 PM | Updated on Aug 4 2026 7:56 PM

Who is Tukaram Mundhe.The Singham IAS Officer with 25 Transfers in 20 Years

ముంబై: భారత పాలనా వ్యవస్థలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగని,అవినీతిపై రాజీలేని పోరాటం చేసే నిప్పులాంటి అధికారులకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు ఐఏఎస్ అధికారి తుకారాం ముండే. తన సుదీర్ఘ కెరీర్‌లో నిబంధనల అమలు విషయంలో ఎక్కడా తగ్గకపోవడం వల్ల సుమారు 25 సార్లు బదిలీలు ఎదుర్కొన్న ఈ రియల్ లైఫ్ సింగం తాజాగా మహారాష్ట్రలో మరో సంచలనానికి తెరతీశారు. ఏకంగా చట్టాన్ని రక్షించే బాంబే హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్లనే సీల్ చేయించి దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారారు.

ఈ ఏడాది మే నెలలో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా తుకారాం ముండే బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవి చేపట్టడమే ఆలస్యం.. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న ఆహార కల్తీ ముఠాలపై, అపరిశుభ్ర హోటళ్లపై ఉక్కుపాదం మోపారు. కేవలం రెండు నెలల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 10వేలకంటే ఎక్కువ హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులపై ముండే తన ఎఫ్‌డీఏ బృందాలతో మెరుపు దాడులు చేయించారు. కోట్ల విలువైన కల్తీ పాలు, నూనెలు, నిషేధిత గుట్కాలను సీజ్ చేయడమే కాకుండా, కనీస పరిశుభ్రత పాటించని వందలాది ప్రసిద్ధ సంస్థల లైసెన్స్‌లను కూడా తక్షణమే రద్దు చేస్తూ వస్తున్నారు.

తుకారాం ముండే తీసుకుంటున్న ఈ మెరుపు చర్యలపై తీవ్రంగా నష్టపోయిన పలువురు పెద్ద పెద్ద వ్యాపారస్థులు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ధర్మాసనం ఎఫ్‌డీఏ తీరును ప్రశ్నిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. మీరు కేవలం ప్రైవేట్ హోటళ్లు, రెస్టారెంట్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్యాంటీన్లలో కూడా ఇలాగే తనిఖీలు చేస్తున్నారా? చట్టం అందరికీ సమానంగా వర్తించాలి’అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కోర్టు అడిగిన ప్రశ్నకు స్పందనగా, మరుసటి రోజే మహారాష్ట్ర ఎఫ్‌డీఏ అధికారుల బృందం బాంబే హైకోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించింది. అప్పటికే బాంబే బార్ అసోసియేషన్ తమ ప్రధాన క్యాంటీన్‌ను స్వచ్ఛందంగా మూసివేసినప్పటికీ, ఎఫ్‌డీఏ తనిఖీలలో ఆ క్యాంటీన్‌కు చెల్లుబాటు అయ్యే ఫుడ్ లైసెన్స్ (FSSAI) లేదని వెల్లడైంది. దీనితో నిబంధనల ప్రకారం అధికారులు ఆ క్యాంటీన్‌కు 'స్టాప్ బిజినెస్' (వ్యాపార నిలిపివేత) నోటీసులు జారీ చేసి, లీగల్‌గా సీల్ వేశారు.

చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపిస్తూ, సరైన లైసెన్స్ , పరిశుభ్రత ప్రమాణాలు పాటించని కారణంగా హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్‌పై ఈ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. దీనితో పాటు, మహారాష్ట్ర సచివాలయ (మంత్రాలయ) పరిధిలోని ప్రభుత్వ క్యాంటీన్లలో కూడా ఎఫ్‌డీఏ బృందాలు దాడులు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వాటికి నోటీసులు జారీ చేసి మూసివేయించాయి.

ప్రభుత్వ వ్యవస్థలను సైతం వదలకుండా తుకారాం ముండే తీసుకున్న ఈ మెరుపు నిర్ణయంపై సోషల్ మీడియాలో సామాన్య ప్రజల నుండి భారీ మద్దతు లభిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసి 57 సార్లు ట్రాన్స్‌ఫర్లయిన ఐఏఎస్ అశోక్ ఖేమ్కా నిజమైన వారసుడు తుకారాం ముండే అంటూ మహారాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆయనను కీర్తిస్తున్నారు. 

ఐఏఎస్ అధికారి తుకారాం ముండే తన 21 ఏళ్ల సర్వీసులో రికార్డు స్థాయిలో మొత్తం 25 సార్లు బదిలీ అయ్యారు.ఆయన 2005 బ్యాంచ్ మహారాష్ట్ర కేడర్ అధికారి. అవినీతిపై రాజీలేని పోరాటం చేయడం, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్లే ఆయనకు సగటున ఏడాదికి ఒకసారి కంటే ఎక్కువగానే బదిలీలు జరిగాయి.మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా ఆయనకు దక్కిన బాధ్యత ఆయన కెరీర్‌లో 25వ పోస్టింగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement