ముంబై: అడవి సఫారీకి వెళ్లిన ఒక కుటుంబానికి తిరిగి వస్తున్న సమయంలో జీవితాంతం మర్చిపోలేని ఓ దృశ్యం కనపడింది. మహారాష్ట్రలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్లో ఒక ఆడపులి తన మూడు చిన్న పిల్లలతో రోడ్డు దాటుతూ కనిపించింది. ఈ అరుదైన క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ అంకుశ్ జిజిల్వార్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. జులై 15 సాయంత్రం తన కుటుంబం పద్మాపూర్ గేట్ నుంచి తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్లో సఫారీ కోసం ప్రవేశించిందని ఆయన తెలిపారు.
అంకుశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వారు మొహర్లీ గ్రామం దగ్గరకు చేరుకున్నప్పుడు రోడ్డు పక్కన కొన్ని వాహనాలు నిలిపి ఉండటం చూశారు. మొదట పులి అడవిలోకి వెళ్లిపోయిందని అనుకున్నారు. కానీ సాయంత్రం 7.03 గంటలకు అకస్మాత్తుగా ఎత్తైన గడ్డి మధ్య నుంచి ఆడపులి ‘ఛోటీ మధు’ బయటకు వచ్చింది.
కొన్ని సెకన్ల తర్వాత గడ్డి మధ్య నుంచి ఒక్కొక్కటిగా దాని మూడు పిల్లలు కూడా బయటకు వచ్చాయి. వీడియోలో ఆడపులి ఎంతో ప్రశాంతంగా తన పిల్లలను రోడ్డు దాటిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న వారంతా మంత్రముగ్ధులయ్యారు.
ఈ సమయంలో ఒక బైక్పై వెళ్తున్న వ్యక్తి అనుకోకుండా ఆడపులి వైపు వెళ్లడం ప్రారంభించాడు. అంకుశ్ వెంటనే తన కారు హెడ్లైట్ను వెలిగించి అతడిని అప్రమత్తం చేశారు. బైకర్ సమయానికి ఆగి సురక్షితంగా పులికి దూరం పాటించాడు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు.
అంకుశ్ స్పందిస్తూ.. అడవి వాతావరణంలో ఇంత దగ్గరగా ఆడపులిని తన మూడు పిల్లలతో చూడటం తమ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే అనుభవాల్లో ఒకటని తెలిపారు. ఇలాంటి క్షణాలు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తాయని చెప్పారు.


