సాక్షి,న్యూఢిల్లీ: తన అమెరికా చదువులకు అయ్యే ఖర్చు వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చీఫ్ అభిజిత్ దీప్కే స్పందించారు. ఆర్టీఐ యాక్టివిస్ట్కు కౌంటర్ ఇచ్చారు. లెక్కల్లో చూపని కుటుంబ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో అమెరికా బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నారనే ఆరోపణల్ని సీనియర్ జర్నలిస్ట్ బార్కాదత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిజిత్ దీప్కే ఖండించారు.
‘బోస్టన్ యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశా. నా చదువుకు అయ్యే ఖర్చును యూనివర్సిటీ స్కాలర్ షిప్లో అందించగా మిగిలిన మొత్తాన్ని లోన్ రూపంలో తీసుకున్నాను. ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నానని’ తెలిపారు. ఈ సందర్భంగా బోస్టన్ యూనివర్సిటీ తనకు అందించిన స్కాలర్ షిప్ సంబంధిత వివరాల్ని ఆయన బహిర్ఘతం చేశారు.
అభిజిత్ దీప్కే ఇటీవల దేశంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో నీట్ పేపర్ లీకేజీపై ఉద్యమం చేశారు. ఫలితంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే సూరత్కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆయనపై ఫిర్యాదు చేశారు. అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్ రావ్ దీప్కే మహరాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) ఒక సాధారణ రిటైర్డ్ జూనియర్ ఇంజినీర్. అభిజిత్ తండ్రి నెలకు రూ.60వేల నుంచి రూ.65వేలు ఖర్చు చేసి కొడుకును అమెరికా చదివించడానికి అంత భారీగా నిధులు ఎక్కడి నుంచి తెచ్చారంటూ ఆయన ఆస్తులపై దర్యాప్తు కోరారు.
ఇక బార్కాదత్ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో సీజేపీ తన కార్యకలాపాలకు నిధులు ఎలా సమకూర్చుకోవాలని యోచిస్తోందనే ప్రశ్నలకు కూడా దీప్కే సమాధానమిచ్చారు. ఇకపై సీజేపీ క్రౌడ్ఫండింగ్ చేస్తుంది. ఇందులో భాగంగా ప్రజల నుండి విరాళాలు సేకరిస్తాం. ఆ విషయంలో మేము పారదర్శకంగా ఉంటాము’ అని అన్నారు.
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పేపర్ లీక్ ఉద్యమానికి సాధారణ పౌరులే మాకు మద్దతిచ్చారు. నిరసనల్లో పాల్గొన్న వారే స్వచ్ఛదంగా ఆహారం, మంచినీరు ఇలా వారికి కావాల్సినవి వారే తెచ్చుకున్నారు. ఇతరులకు కూడా పంచి పెట్టారు. ఈ ఉద్యమానికి కొంతమంది ఢిల్లీ పోలీసు సిబ్బంది రహస్యంగా మద్దతు తెలిపారు. ఢిల్లీ పోలీసుల పిల్లలు నీట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. తమ పిల్లల తరుఫున పోలీసులే.. మాకు కావాల్సిన ఆహార పదార్ధాల్ని ఉచితంగా అందించారు. వారి వివరాల్ని బహిర్ఘతం చేయొద్దని మమ్మల్ని కోరారు. నీట్ ఆందోళనపై సానుభూతి వ్యక్తం చేస్తూ ఈ ఆహార పదార్ధాల్ని ఇస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు.
నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో అరెస్టయిన నిరసనకారుల కోసం కపిల్ సిబల్ రూ. 1 కోటి న్యాయ సహాయ నిధిని ప్రకటించారు. ఆ తర్వాతే సీజేపీ ఆర్థిక వ్యవహారాలపై పరిశీలన పెరిగింది. ఆ ఆర్టీఐ కార్యకర్త సీజేపీ చట్టపరమైన హోదాపై భారత ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించి, సిబల్ సహాయాన్ని పరిశీలించాలని కోరారు.
దీప్కేతో పాటు, సీజేపీ అధికార ప్రతినిధి వైష్ణవి గౌర్ కూడా ఆ ఆర్టీఐ కార్యకర్తపై కౌంటర్ ఇచ్చారు. అతను ఓ ప్రైవేట్ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి విద్యా ఖర్చుల కోసం ఆర్టీఐలు దాఖలు చేసేవారు పీఎం కేర్స్ ఫండ్ను కూడా చూడాలి. మోదీజీ మిమ్మల్ని క్షమిస్తారు. చింతించకండి అని గౌర్ పోస్ట్లో పేర్కొన్నారు. ఆ సంస్థ నిధులు, చట్టపరమైన హోదాపై ప్రశ్నలు తీవ్రతరం కావడంతో, సీజేపీ ఆ ఫిర్యాదులను రాజకీయ కుట్రలో భాగంగా కొట్టిపారేసింది.



