విశ్వనటుడు కమల్ హాసన్ తనయ, ప్రముఖ నటి శృతిహాసన్ తన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights), ప్రచార హక్కుల (Publicity Rights) పరిరక్షణ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో రూపొందించిన కంటెంట్, మార్ఫింగ్ చిత్రాలు, డీప్ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలతో తన పేరు, ఫొటోలను ఉపయోగించి అనధికారికంగా వస్తువుల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంలో పలు భారతీయ, విదేశీ సంస్థలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రముఖ సోషల్ మీడియా వేదికలతో పాటు కొందరు గుర్తుతెలియని వ్యక్తులను కూడా ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ప్రతివాదుల్లో ఒకటైన ఓ క్రాఫ్ట్ వర్క్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వేదికలో శృతిహాసన్ పేరు, ఫొటోలతో కూడిన పోస్టర్లను ఆమె అనుమతి లేకుండానే విక్రయిస్తున్నట్లు పిటిషన్లో ఆరోపించారు.
అదేవిధంగా గూగుల్, మెటా, ఎక్స్, పింట్రెస్ట్ వంటి డిజిటల్ వేదికల్లో తనను ఇతర నటులతో అనుచితంగా అనుసంధానించే ఏఐ వీడియోలు, అసభ్యకరమైన డీప్ఫేక్ చిత్రాలు ప్రసారం చేస్తున్నారు. ఈ కంటెంట్ తన ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
తన పేరు, ఫొటోలు, వ్యక్తిత్వాన్ని ఎవరూ అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వినియోగించకుండా శాశ్వత ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేయాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్ను తొలగించాలని, జరిగిన నష్టానికి తగిన నష్టపరిహారం కూడా చెల్లించాలని వారు కోర్టును విజ్ఞప్తి చేశారు. శృతిహాసన్ దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్లోనూ మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.


