తమిళ స్టార్ హీరో విజయ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. అయితే ఈయన వారసుడు జేసన్ సంజయ్.. తండ్రిలానే హీరో అవుతారని అంతా అనుకుంటే దర్శకుడు అయ్యాడు. అలా 'సిగ్మా' మూవీ తీశాడు. లెక్క ప్రకారం గత నెల చివరలో రిలీజ్ కావాలి. కానీ వాయిదా వేశారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా బోలెడన్ని విషయాలు పంచుకున్న జేసన్.. ఓసారి తాను చేసిన పని ఎంతలా కుటుంబాన్ని కంగారు పెట్టిందో వెల్లడించాడు.
(ఇదీ చదవండి: విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు)
'మా అమ్మ ఓ గూఢచారిలా ఉంటుంది. నేను రహస్యంగా ఏం చేయడానికి ప్రయత్నించినా, ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లినా సరే దొరికిపోయేవాడిని. గతంలో నేను అర్థరాత్రి ఎవరికీ చెప్పకుండా బయటకెళ్లి, తర్వాత రోజు ఉదయం తిరిగొచ్చాను. అయితే అప్పుడు నా ఫోన్ స్విచ్ఛాప్ ఉండేసరికి ఇంట్లో వాళ్లు కంగారుపడ్డారు. ఏకంగా మిస్సింగ్ కేసు పెట్టేందుకు రెడీ అయిపోయారు. సరిగ్గా ఆ టైంకి ఇంటికి చేరుకున్నాను' అని జేసన్ సంజయ్ చెప్పుకొచ్చాడు.
ఇక తండ్రి ముఖ్యమంత్రి కావడంపై స్పందించిన జేసన్.. దీనిని 'చారిత్రక విప్లవం' అని అన్నాడు. 'నాన్న సీఎం కావడం మా కుటుంబ సభ్యులందరికీ ఎంతో పెద్ద బాధ్యతతో పాటు గౌరవం కూడా. అదే సమయంలో మేమంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని అన్నాడు. తండ్రి ఇచ్చిన సలహా గురించి మాట్లాడుతూ.. 'ఆయన నాకు చెప్పిన మాటల్లో నాకు చాలా ఇష్టమైనది ఒకటే. 'నువ్వు నీకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలి' అని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ఆ సలహానే నాకు జీవితంలో ఎంతో ప్రేరణనిచ్చింది. ఎప్పుడైనా నీకు నా సహాయం అవసరమైతే నన్ను సంప్రదించొచ్చు. కానీ ముందుగా నువ్వే చొరవ తీసుకుని నా దగ్గరకు రావాలి. నేను అడగను అని నాన్న నాతో చెప్పారు' అని జేసన్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)


