ప్రథమ ప్రాధాన్యం తలసేమియా, సికిల్సెల్ అనీమియా బాధితులకు...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తలసేమియా, సికిల్సెల్ అనీమియా బాధితులు, దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భర్త /భార్యకు వెంటనే సామాజిక భద్రత పింఛన్ల మంజూరుకు చర్యలు చేపట్టాలని డీఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. శుక్రవారం పీఆర్ఆర్డీలోని డీఆర్డీఓలు, మున్సిపల్శాఖలోని మున్సిపల్ కమిషనర్లతో సెర్ప్ సీఈఓ, మెప్మా ఇన్చార్జ్ దివ్యదేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.దీనికి సంబంధించి సంబంధిత అధికారులకు ఇందుకు అవసరమైన ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.
సెర్ప్ రికార్డుల ప్రకారం ఇప్పటికే ప్రాథమికంగా 1,599 మంది తలసేమియా బాధితులను గుర్తించి సర్టీఫికెట్లు ఇచ్చారు. మిగిలిన అర్హులైన బాధితులు కూడా వైద్య ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 6 వేల తలసేమియా, 1,700 సికిల్సెల్ అనీమియా బాధితులున్నట్టు ప్రాథమికంగా అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఆగస్టు 15 నుంచి కొత్తగా రెండున్నర లక్షల చేయూత పింఛన్ల మంజూరుకు పీఆర్ఆర్డీ కసరత్తు ప్రారంభించింది. వీరిలోనూ వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఏ ప్రాతిపదికన ఏ కేటగిరీలో ఎంత మందికి కొత్త పింఛన్లు మంజూరు చేయాలనే దానిపైనా అధికారుల్లోనూ సందిగ్ధత నెలకొంది.


