breaking news
Justice Surya Kant
-
మానవత్వం లేని చట్టంతో అరాచకమే
పణాజి: మానవత్వం ప్రతిబింబించని చట్టంతో అరాచకమే ప్రబలుతుందని, అదే సమయంలో చట్టంలేని మానవత్వం నిరంకుశానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. ‘చట్టం ఒక సజీవ వ్యవస్థ. అది నిలకడకు, మార్పునకు సమతుల్యతను పాటించాలి. చట్టం మార్పును అడ్డుకోరాదు. అదే సమయంలో, సరైన ఆలోచన లేకుండా కేవలం కొత్తదనం కోసం దేనినీ గుడ్డిగా స్వీకరించకూడదు. లేదంటే నైతిక స్థానాన్ని కోల్పోతుంది’అని ఆయన అభిప్రాయపడ్డారు. మార్పును ఆకళింపు చేసుకోలేని చట్టం శుద్ధంగా ఉండజాలదన్నారు. ఆదివారం ఆయన గోవాలో ఇంటర్నేషనల్ లీగల్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంతోపాటు గోవా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డ్రగ్స్ వ్యసనంపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి చట్ట వ్యవస్థ కూడా శతాబ్దాల తరబడి జరిగిన పోరాటాలు, చర్చలు, రాజీలు, నైతిక ధైర్యం నుంచి అందిన ఒక వారసత్వంగా ఆయన అభివరి్ణంచారు. వారసత్వంగా అందుతూ, అనేక పరీక్షలకు తట్టుకుని నిలబడిన న్యాయ వ్యవస్థకు తాము యజమానులం కాదు, కేవలం తాత్కాలిక సంరక్షకులం మాత్రమే అనే విషయం తన మదిలో ఎప్పుడూ మెదులుతూ ఉంటుందన్నారు. ‘మాదక ద్రవ్యాల వాడకం కేవలం నేరం మాత్రమే కాదు, అది ఒక సామాజిక, మానసిక, వైద్యపరమైన సమస్యగా గుర్తించాలి. అవగాహన ద్వారానే ఇది పరిష్కారం కావాలే తప్ప, శిక్షలు హెచ్చరికల ద్వారా కాదు’అని సీజేఐ అన్నారు. ‘డ్రగ్స్ వ్యసనం నిశ్శబ్దంగా మన ఇళ్లలోకి, తరగతి గదుల్లోకి, సమాజంలోకి ప్రవేశించి, భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఇది కేవలం వ్యక్తులనే కాదు, సమాజాన్నే పాడు చేస్తుంది’అని ఆయన హెచ్చరించారు. -
BCCI: మీ సమస్య ఏంటి?: సుప్రీంకోర్టు ఆగ్రహం
భారత క్రికెట్ జట్టును టీమిండియా అని పిలవొద్దంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో పిటిషనర్కు ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. హైకోర్టు కఠినమైన చర్యలు తీసుకోకుండా వదిలేసినందునే పిటిషనర్ ఇక్కడి వరకు వచ్చే సాహసం చేశారని మండిపడింది.పూర్వాపరాలు ఇవేప్రైవేట్ సంస్థ అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసే జట్టును టీమిండియా, జాతీయ జట్టు అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు దేశం పేరు వాడుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు.టీమిండియా అనకూడదుప్రసార్ భారతి తన కార్యక్రమాల్లో క్రికెట్ జట్టును టీమిండియా అని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రీపక్ కన్సాల్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. విశ్వవేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు టీమిండియా లేదంటే భారత జట్టు అని ఎందుకు పిలవకూడదని ప్రశ్నించింది.దేశం పేరు, జాతీయ చిహ్నాల వాడకం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని.. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని మందలించింది. అయితే, సదరు పిటిషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్కు గట్టిగానే అక్షింతలు వేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది.మీ సమస్య ఏమిటి?ఈ సందర్భంగా.. ‘‘మీరు ఇంట్లో కూర్చుని ఇలాంటి పిటిషన్లు డ్రాఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినా ఇందులో (టీమిండియా) మీకు సమస్య ఏమిటి? జాతీయ క్రీడా ట్రిబ్యునల్లో అద్భుతమైన సభ్యులు ఉన్నారు. ఇలాంటి విషయాల కోసం కోర్టుపై భారం మోపకండి’’ అని సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు ఈ విషయంలో తప్పు చేసింది అదే విధంగా.. ‘‘మీ విషయంలో హైకోర్టు తప్పు చేసినట్లు అనిపిస్తోంది. ఇలా కోర్టు సమయం వృథా చేస్తున్నందుకు మీకు జరిమానా వేయాల్సింది. అలా చేయకుండా హైకోర్టు తప్పు చేసింది. అందుకే మీరు ఇలాంటి పనికిరాని పిటిషన్లతో సుప్రీం కోర్టు వరకు వచ్చారు’’ అని సీజేఐ మండిపడ్డారు.ఈ క్రమంలో ధర్మాసనం సదరు పిటిషనర్ను రూ. 10 లక్షలు కట్టాల్సిందిగా ఆదేశించగా.. తన క్లైంట్ పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని న్యాయవాది కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
ఇంకెంత ఎండబెడతారు?
న్యూఢిల్లీ: చండీగఢ్లోని ప్రఖ్యాత సుఖ్నా చెరువు దుస్థితిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వెలిబుచ్చారు. ‘సుఖ్నా లేక్ కో ఔర్ కిత్నా సుఖావొగే? (ఆ చెరువును ఇంకెంత ఎండబెడతారు?)’ అంటూ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ మాఫియా ఆ చెరువును చెరబట్టిందంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. నేతలు, అధికారులు కూడా వారితో చేతులు కలిపి చెరువును సర్వనాశనం చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుఖ్నా చెరువుకు సంబంధించి 1995 నుంచి పెండింగ్లోలో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయమూర్తులు, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీతో కూడిన సీజేఐ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. అడవులు, చెరువులకు సంబంధించిన కేసులు హైకోర్టులకు వెళ్లకుండా నేరుగా ఇలా సుప్రీం గడప తొక్కుతుండటం ఏమిటంటూ విస్మయం వెలిబుచ్చింది. -
స్వార్థం కోసం మౌలిక వసతులను అడ్డుకోవద్దు
గౌహతి: అస్సాంలోని గౌహతిలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ జ్యుడీషియల్ కోర్ట్ కాంప్లెక్స్ను గౌహతి హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకించడం పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ కోర్ట్ కాంప్లెక్స్కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..మౌలిక సదుపా యాల కల్పనను వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు, అది అందరికీ మేలు చేస్తుందని, కేవలం కొందరి సౌలభ్యం కోసం ఆధునీకరణను ఆపకూడదని అభిప్రాయపడ్డారు. వాస్తవాలు తెలియకనే కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. గౌహతిలోని రంగమహల్లో రూపుదిద్దుకునే ఈ సముదాయం భవిష్యత్తు ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఇందులో అత్యాధునిక సాంకేతికత, ఈ–కోర్టులు, లాయర్లు, కక్షిదారుల కోసం మెరుగైన వసతులు ఉంటాయని తెలిపారు. దేశ అత్యున్నత న్యాయాధికారిగా, ఈ వృత్తిలోకి కొత్తగా వస్తున్న యువ న్యాయవాదుల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందని జస్టిస్ సూర్య కాంత్ నొక్కి చెప్పారు. యువ లాయర్లు సమర్థంగా పనిచేయడానికి మెరుగైన లైబ్రరీలు, ఇంటర్నెట్ సదుపాయం, అనుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ కర్తవ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతోపాటు సీఎం హిమంత బిశ్వ శర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌహతి నగరం నడిబొడ్డున ఉన్న హైకోర్టును 25 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతానికి తరలించడాన్ని బార్ కౌన్సిల్ వ్యతిరేకిస్తోంది.కాంప్లెక్స్ ప్రత్యేకతలుఅస్సాంలోని గౌహతి ఉత్తర ప్రాంత కామ్ రూప్ జిల్లాలో 49 ఎకరాల విస్తీర్ణంలో మొదటి దశలో రూ.479 కోట్ల ఈ సముదాయం ఏర్పాటు కానుంది. ఇందులో, గౌహతి హైకోర్టుతోపాటు జిల్లా కోర్టు భవనాలు, హైకోర్టు కార్యాలయం, బార్ అసోసియేషన్ భవనం ఉంటాయి. గౌహతి హైకోర్టు అస్సాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగా ల్యాండ్లకు కూడా హైకో ర్టుగా పనిచేస్తుంది. ఈ సముదాయంలో 900 వరకు కార్లు, 400 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ వసతి ఉంది. సముదాయంలోని అన్ని భవనాలను కలుపుతూ వంతెనలు, అత్యాధునిక భద్రతా వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ సురక్షితంగా ఉండేలా డిజైన్ చేశారు. -
మధ్యవర్తిత్వమే మార్గం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాలతో కంటే.. సామరస్య పూర్వకంగా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం మేలని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చెప్పింది. మధ్యవర్తిత్వంతో సహా మూడు పరిష్కార మార్గాలను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ రెండు రాష్ట్రాల ముందుంచారు. పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ‘పోలవరం–నల్లమల సాగర్’ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచిందని, దీనిపై తక్షణమే స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం జస్టిస్ జాయ్మాల్యా బగ్చితో కూడిన సీజేఐ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఏపీ తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఇతర న్యాయవాదులు వాదనలు విన్పించారు. మా నీటిని తరలించుకుపోయే కుట్ర: తెలంగాణ సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గోదావరి బేసిన్లో తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉంది. పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా ఏపీ 200 టీఎంసీలను మళ్లిస్తే తెలంగాణ వాటాకు గండి పడుతుంది. వరద జలాల పేరుతో తెలంగాణకు కేటాయించిన నీటిని తరలించుకుపోయే కుట్ర ఇది. ఈ ప్రాజెక్టును ఆపాలని ఆదేశించాలి. అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా ఏపీ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పోలవరం నుంచి అక్రమంగా 200 టీఎంసీల వరద నీటిని మళ్లించేందుకు వీలుగా టెండర్లు పిలిచింది. సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా, కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఆమోదం పొందకుండానే ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ చైర్మన్ నేతత్వంలో వేసిన కమిటీకి ప్రాజెక్టు పనులను ఆపే అధికారం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని కేంద్రం నియమించిన కమిటీ నివేదిక వచ్చేంత వరకైనా పనులను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలి..’ అని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోయింది..నీళ్లు కూడా వద్దా?: ఏపీ ముకుల్ రోహత్గీతో పాటు సీనియర్ న్యాయవాదులు బల్బీర్ సింగ్, జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. ‘పోలవరం–నల్లమల సాగర్ విషయంలో ఏపీ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. ప్రస్తుతం ప్లానింగ్ దశలోనే ఉన్నాం. ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్), డీపీఆర్ తయారీ కోసమే సర్వేలు, టెండర్ల ప్రక్రియ చేపట్టాం. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు చేయడం లేదు. గోదావరి నుంచి సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని కరువు ప్రాంతమైన రాయలసీమకు అందించాలన్నదే ఏపీ ఉద్దేశం. ఇది ఆ రాష్ట్ర అంతర్గత అవసరాల కోసం చేపడుతున్న ప్రాజెక్టు..’ అని వెల్లడించారు. రోహత్గీ వాదిస్తూ.. ’ఇప్పటికే రాష్ట్ర విభజనలో ఏపీ నుంచి హైదరాబాద్ను తీసేసుకున్నారు. ఇప్పుడు సముద్రంలో కలిసే నీళ్లు కూడా వాడుకోకూడదా?..’ అని ప్రశ్నించారు. 2014 విభజన చట్టం ద్వారా ఈ జాతీయ ప్రాజెక్టుకు తెలంగాణ సమ్మతి తెలిపినట్టేనని బల్బీర్ సింగ్ అన్నారు. తెలంగాణ పిటిషన్ దురుద్దేశపూర్వకమైనదని జైదీప్ గుప్తా చెప్పారు. ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు కానీ..: సీజేఐ వాదనల సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం ప్రాజెక్టు నివేదికల తయారీ కోసమే టెండర్లు పిలిచామన్న వాదనలపై స్పందిస్తూ.. ’ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు. కానీ ఒకవేళ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని తేలి ఆగిపోతే.. ప్లానింగ్, డాక్యుమెంటేషన్ కోసం ఖర్చు చేసిన ప్రజల నిధులు వృధా అవుతాయి కదా?’ అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ విచారణార్హతను పరిశీలిస్తున్నామని చెప్పారు. మూడు పరిష్కార మార్గాలు ఈ కేసులో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ముందు, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మూడు ప్రధాన పరిష్కార మార్గాలను ఇరు రాష్ట్రాల ముందు ఉంచారు. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ‘మొదటి మార్గంగా.. ఇది రెండు రాష్ట్రాల నడుమ తలెత్తిన జల వివాదం కాబట్టి, ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్గా కాకుండా, ఆర్టికల్ 131 ప్రకారం ‘సివిల్ సూట్’గా దాఖలు చేస్తే సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుంది. రెండవ మార్గంలో.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ వివాదంపై ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసినందున, ఆ కమిటీకి.. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైతే ఆ ప్రాజెక్టును నిలిపివేసే (స్టే ఇచ్చే) ‘నిర్ణయాధికారాన్ని’ కల్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన మూడవ మార్గంగా.. కోర్టు తీర్పుల దాకా వెళ్లకుండా, ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కలిసి కూర్చుని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు..’ అని చెప్పారు. ఈ ప్రతిపాదనలపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సమయం కావాలని తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వీ కోరడంతో.. ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 12వ తేదీకి వాయిదా వేసింది. -
పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్ట్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
సాక్షి, ఢిల్లీ: పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్పై మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి అంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సూచించారు. అనంతరం, కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా చేశారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరారు. ఈ ప్రాజెక్టుతో గోదావరిలో తమ వాటా తగ్గుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్కు సంబంధించి మూడు పరిష్కారాలను సుప్రీంకోర్టు సూచించింది.1. సమగ్ర విచారణ కోసం సివిల్ సూట్ ఫైల్ చేయమని సూచన 2. కేంద్ర ప్రభుత్వ కమిటీకి తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైతే ప్రాజెక్టును ఆపే నిర్ణయాధికారాన్ని ఇస్తాం.3. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుని అవకాశం ఇచ్చారు.జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు..అంతకుముందు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉంది కదా?. ప్లానింగ్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్కి ఏపీ నిధులే వృధా అవుతాయి కదా?. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ పిటిషన్ విచారణ అర్హతను పరిశీలిస్తున్నాం. సివిల్ సూట్ ఫైల్ చేస్తేనే సమగ్రంగా విచారణ జరపవచ్చు. ప్రాజెక్టు ఆపాలన్న మీ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వ కమిటీ పరిశీలించేలా చూడమని ఆదేశాలు ఇస్తాం. అలాగే మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అని అన్నారు.ఏకపక్షంగా నిర్మాణం..అనంతరం, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు వినిపిస్తూ..‘వరద జలాల పేరుతో మాకు కేటాయించిన నీటి వాటాను తరలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుపై వెంటనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వాలి. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి వాటా ఉంది. పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్టుతో మా వాటా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్ర జల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఏపీ పట్టించుకోవడం లేదు. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో ఇటీవల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ప్రాజెక్టును ఆపే అధికారం లేదు. సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రాజెక్టును ఆపాలన్నారు.రాష్ట్ర ప్రాజెక్ట్ మాత్రమే.. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ..‘పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టులో మేము నిబంధనలు ఉల్లంఘించలేదు. కేవలం మేము ప్లాన్ రెడీ చేసుకుంటున్నాం. సముద్ర జలాలు వృథా అవుతున్నాయి. వాటిని రాయలసీమకి అందించాలనుకుంటున్నాం. ఇది రాష్ట్ర ప్రాజెక్టు మాత్రమే జాతీయ ప్రాజెక్టు కాదు. మా రాష్ట్ర అవసరాలపైన ప్లానింగ్ చేసుకునే అధికారం ఉంది. మేము పీఎఫ్ఆర్, డీపీఆర్లను తయారు చేస్తున్నాము అని తెలిపారు.ఈ క్రమంలో సుప్రీంకోర్టు సూచించిన పరిష్కారాలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని అభిషేక్ సింఘ్వీ కోరారు. అనంతరం, కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా చేశారు. -
అవసరంలో ఉన్నవారికి న్యాయం అందాలి
పట్నా: న్యాయ వ్యవస్థలో సహానుభూతి అత్యంత కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయం కోరి వచ్చినవారి పట్ల దయతో మెలగాలని అన్నారు. సమాజం మెరుగుపడాలంటే అవసరంలో ఉన్నవారికి కచ్చితంగా న్యాయం అందాలని స్పష్టంచేశారు. అవసరార్థుల పట్ల న్యాయ వ్యవస్థ మొగ్గుచూపాలని సూచించారు. శనివారం బిహార్ రాజధాని పట్నాలోని చాణక్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. యువ న్యాయవాదులు కెరీర్ను నిర్మించుకొనే క్రమంలో సున్నితత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోవద్దని పేర్కొ న్నారు. పూర్తిగా పనికి బానిసగా మారితేనే వృత్తిలో విజయం సాధిస్తామని చాలామంది యువ లాయర్లు నమ్ముతుంటారని తెలిపారు. చేసే పనే జీవితంగా మారిపోతే ఇతరుల సహానుభూతిని కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. న్యాయం కోసం వచ్చిన కక్షిదారులకు దయతో సేవ చేయడమే పరిమావధి కావాలని న్యాయ వాదులకు కావాలని జస్టిస్ సూర్యకాంత్ పిలుపునిచ్చారు. న్యాయం చేకూర్చడం పవిత్రమైన బాధ్యత ‘‘న్యాయం అనేది న్యాయాన్ని పొందగలిగే ఆర్థిక స్థోమత ఉన్నవారికి మాత్రమే కాకుండా.. న్యాయం తప్పనిసరిగా అవసరమైన వారికి కూడా సులువుగా అందాలి. కక్షిదారులకు న్యాయం చేకూర్చడానికి న్యాయవాదులు తమ శక్తియుక్తులు, నైపుణ్యాలు ఉపయోగించాలి. అదొక పవిత్రమైన బాధ్యత. ఇక్కడ నేర్చుకున్న న్యాయశాస్త్రాన్ని ప్రజలు మేలు చేసేలా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సమాజంలో పేద, అణగారిన వర్గాలకు కొన్ని సందర్భాల్లో న్యాయం దక్కడం లేదు. అలాంటివారి కోసం న్యాయ వ్యవస్థ పనిచేయాలి. ఎవరికి న్యాయం అవసరమో వారికి న్యాయం అందించడం కర్తవ్యం కావాలి. లిటిగేషన్, ప్రజాసేవ, విద్యా రంగం, జ్యుడీషియల్ సర్వీసు.. ఇలా ఏ మార్గంలో నడిచినా సరే న్యాయ వ్యవస్థ పరిరక్షణకు కృషి చేయాలి. ప్రజల్లో విశ్వాసం పెంచేలా చిత్తశుద్ధితో పని చేయాలి. గొంతు విప్పలేని అసహా యకులకు గొంతుకగా మారడానికి నైపు ణ్యాలు ఉపయోగిస్తే వారి గౌరవాన్ని కూడా పెంచినట్లు అవుతుంది. చదుకున్న చదు వుకు సార్థకత లభిస్తుంది’’ అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పట్నా హైకోర్టు ప్రాంగణంలో ఏడు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు జస్టిస్సూర్యకాంత్ పునాది రాయి వేశారు. ఇందులో ఆడిటోరియం, ఐటీ బిల్డింగ్, పరిపాలన భవనం, బహుళ అంతస్తుల కారు పార్కింగ్, ఆసుపత్రి వంటివి ఉన్నాయి.సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలి దేశంలో సైబర్నేరాలు నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్య ప్రజలు.. ముఖ్యంగా వృద్ధులు కోట్ల రూపాయలు పోగోట్టుకుంటున్నారని చెప్పారు. ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జస్టిస్ సూర్యకాంత్ శనివారం పట్నా శివారులోని పొతాహీలో బిహార్ జ్యుడీషియల్ అకాడమీ నూతన క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డిజిటల్ అరెస్టు గురించి గతంలో ఎప్పుడూ వినలేదని, ప్రస్తుతం అలాంటి చూడాల్సి వస్తోందని అన్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరించి, సొమ్ము లూటీ చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ ఎదుట ఉన్న అతిపెద్ద సవాలు ఇదేనని పేర్కొన్నారు. సైబర్ నేరాల కారణంగా మన దేశంలో జనం వేలాది కోట్ల రూపాయలు కోల్పోవడం తనకు షాక్కు గురి చేసిందని చెప్పారు. వృద్ధులకు సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. ఆధునిక కాలంలో కొత్త కొత్త సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి, సైబర్ నేరాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు నైపుణ్యాలు పెంచుకోవాలని, అందుకోసం శిక్షణ పొందాలని జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయని, అందుకు తగ్గట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. -
ఆ టోల్ప్లాజాలను మూసేయండి
న్యూఢిల్లీ: టోల్ఫీజు కట్టేందుకు తరచూ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిల్చిపోతుండటం, వందల వాహనాల నుంచి ఒకేచోట వెలువడుతున్న పొగ, కాలుష్యం కారణంగా ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) పరిధిలో కాలుష్యఛాంబర్లుగా తయారైన 9 టోల్ప్లాజాలను తక్షణం తాత్కాలికంగానైనా మూసేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. లేదంటే కనీసం ఢిల్లీ–ఎన్సీఆర్ నుంచి సుదూరాలకు తరలించాలని జాతీయరహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ), మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)లకు సుప్రీంకోర్టు బుధవారం సూచించింది. వారంలోపు మీ నిర్ణయం తెలపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పాంఛోలీల ధర్మాసనం ఆదేశించింది. టోల్ప్లాజాల తాత్కాలిక మూసివేత లేదా వేరే చోట ఏర్పాటు ద్వారా హస్తిన సరిహద్దుల్లో తీవ్ర వాయుకాలుష్యానికి కళ్లెం వేయొ చ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘చలికాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరగడం అనేది ఒక వార్షిక తంతుగా తయారైంది. వాయుకాలుష్యానికి ఇకనైనా చెక్పెట్టేలే చర్యలు తీసుకోండి. భారత్ స్టేజ్–4 స్థాయిలో తక్కువ ఉద్గారాలను వెదజల్లని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఆగ స్ట్ 12న మేం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తాం. ఇక నర్సరీ నుంచి ఐదో తరగతి చిన్నారులు నేరుగా పాఠశాలకు రావొద్దంటూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోబోం. ఎందుకంటే త్వరలోనే చిన్నారులకు శీతాకాల సెలవు రాబోతున్నాయి. అప్పుడెలాగు పిల్లలు పాఠశాలకు రారు. ఆమాత్రందానికి మేం జోక్యం చేసుకోవడం అనవసరం’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎంసీడీకి పరిహారం ఇవ్వండి ‘‘ఢిల్లీలోకి ఎంట్రీ పాయింట్లుగా మారిన ఈ 9 టోల్బూత్లు ప్రస్తుతం ఎంసీడీ నిర్వహిస్తోంది. వీటిని తాత్కాలికంగా మూసేయండి. మూసివేత కారణంగా ఎంసీడీ చవిచూసే నష్టాలను ఎన్హెచ్ఏఐ భర్తీచేయొచ్చేమో యోచించండి. తాత్కాలికంగా ఆదాయం కోల్పోయేందుకు ఎంసీడీ సిద్ధపడాలి. ఆ మేరకు తోడ్పాటునందించేలా ఎంసీడీ ముందుకురావాలి. ఈ విషయంలో ఎంసీడీ తన నిర్ణయాన్ని వారంలోపు తెలుపుతూ నివేదికను మా ముందు ఉంచండి’’అని ఎంసీడీని ధర్మాసనం ఆదేశించింది. కన్నాట్ ప్లేస్లోనూ పెట్టేస్తారా? కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఒకింత అసహనంవ్యక్తంచేశారు. ‘‘గురుగ్రామ్ సరిహద్దులోని ఒక టోల్ప్లాజా వద్ద గంటల తరబడివాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వందల వాహనాల నుంచి దట్టమైన పొగ ఒకేచోట పరుచుకుంటోంది. జనవరిదాకా టోల్ప్లాజాను తీసేస్తామని అధికారులు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు?. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్ ప్రాంతంలోనూ టోల్ప్లాజా కట్టేస్తారు. ఎందుకంటే మీకు టోల్ప్లాజా నగదు వసూళ్లు మాత్రమే ముఖ్యంకదా? టోల్గేట్లు ఆదాయాన్ని కళ్లజూపిస్తాయేమో అంతకంటే ఎక్కువగా కాలుష్యాన్నీ తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో మీరు నిర్మాణాత్మకమైన ప్రణాళికతో రండి. జనవరి 31వ తేదీదాకా టోల్ప్లాజా ఉండబోదని ధీమాగా చెప్పగలిగేలా ఒక ప్లాన్తో రండి’’అని మున్సిపల్ కార్పొరేషన్కు సీజేఐ సూచించారు. -
దేవుడిని విశ్రాంతి కూడా తీసుకోనివ్వరా..?
న్యూఢిల్లీ: ఆలయాల్లో ధనవంతులిచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి దేవుడి విశ్రాంతి వేళలోనూ ప్రత్యేక పూజలకు అనుమతించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడి విశ్రాంతికి అంతరాయం కల్గిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బృందావన్లోని ప్రఖ్యాత బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళలతోపాటు సంప్రదాయాల్లో తీసుకువచ్చిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సోమవారం ఈ మేరకు స్పందించింది. బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేశారని, దెహ్రి పూజ వంటి పలు ముఖ్యమైన మతాచారాలను నిలిపివేశారని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, తన్వి దుబేలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ‘సంప్రదాయం, వేడుకల్లో దర్శన వేళలు కూడా ఒక భాగం. భక్తుల దర్శనాల కోసం ఆలయాన్ని తెరిచి ఉంచడం ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయం. ఆలయ వేళలను మార్చితే, లోపల జరిగే పూజలు, వేడుకల వేళలు కూడా మారుతాయి. తదనుగుణంగా దేవుడి ఉదయం మేల్కొనే వేళ, రాత్రి నిద్రించే వేళలూ మారుతాయి. ఇలా జరగరాదు. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని, పవిత్రతను తుచ తప్పక అనుసరించాలి’అని ఈ సందర్భంగా దివాన్ వాదించారు. సెపె్టంబర్లో జారీ అయిన ఆఫీసు మెమోరాండం ప్రకారం ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజా సంప్రదాయాల్లో మార్పులు తెచ్చారని ఆయన తెలిపారు. ఆలయంలో దర్శన వేళలు పూర్తయ్యాక, ఒక ప్రత్యేక ప్రదేశంలో చేపట్టే దెహ్రి పూజను సైతం రద్దీని నివారించేందుకంటూ రద్దు చేస్తూ తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పక్కనబెట్టారని పిటిషనర్లు తెలిపారు. గురు–శిష్య పరంపరలో భాగంగా గోస్వామీలు మాత్రమే ఈ పూజా కార్యక్రమాన్ని జరపాల్సి ఉంటుందన్నారు. ఈ వాదలనపై సీజేఐ సూర్యకాంత్ మౌఖికంగా.. ‘బంకీ బిహారీ జీ ఆలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని నామమాత్రంగా మూసివేస్తున్నారు. అయితే, ఆ వెంటనే దేవుడికి ఒక్క సెకను కాలం కూడా విశ్రాంతినివ్వకుండా, ఇతర విషయాల మాదిరిగానే దేవుడిని కూడా వాడేసుకుంటున్నారు. భారీగా డబ్బు ఇవ్వజూపే ధనవంతుల కోసం ప్రత్యేక పూజలకు అనుమతిస్తున్నారు’అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సమాధానమివ్వాలని ఆలయ నిర్వహణ కమిటీతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది. వాస్తవానికి ఈ ఆలయంలో వేడుకలు, పూజలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ 1939 నాటి నిబంధనల ప్రకారం జరుగుతోంది. అయితే, 2025లో తీసుకువచ్చిన ఉత్తరప్రదేశ్ శ్రీ బంకీ బిహారీ జీ ఆలయ ట్రస్ట్ ఆర్డినెన్స్తో రాష్ట్ర ప్రభుత్వం మత సంస్థల్లో జోక్యం చేసుకునేందుకు అవకాశ మేర్పడింది. తద్వారా అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలకు విఘాతం కలుగుతోందన్న వాదనలు ఉన్నాయి. దీనిపై ఈ ఏడాది ఆగస్ట్లో దాఖలైన పిటిషన్పై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టుకే విడిచిపెట్టింది. అదే సమయంలో, హైకోర్టు స్పష్టత ఇచ్చే వరకు ఆర్డినెన్స్పై స్టే విధించింది. ఆలయ రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ సారథ్యంలో కమిటీని నియమించింది. -
తీర్పును టెక్నాలజీ మెరుగుపర్చగలగాలి
కటక్(ఒడిశా): నూతన సాంకేతికత అనేది న్యాయస్థానాల తీర్పును మరింత మెరుగుపర్చాలిగానీ తీర్పును అధిగమించేదిగా ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఒడిశాలోని కటక్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. పెండింగ్ కేసుల భారం దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు న్యాయ వ్యవస్థలోని ప్రతి స్థాయిలోనూ ఇబ్బందులను సృష్టిస్తున్నాయన్నారు. పైస్థాయిలో తలెత్తిన అడ్డంకులు దిగువ స్థాయిపై ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయని చెప్పారు. పెండింగ్ సమస్యను అధిగమించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సీజేఐ తెలిపారు. అవసరానికి తగినన్ని న్యాయస్థానాలు లేకుంటే, ఎంత చిత్తశుద్ధి కలిగిన న్యాయవ్యవస్థ అయినా కుప్పకూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతతో ఎన్నో సౌలభ్యాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ దు్రష్పభావాలు కూడా ఉన్న విషయం మరువరాదన్నారు. నేటి డీప్ ఫేక్లు, డిజిటల్ అరెస్ట్ల కాలంలో న్యాయస్థానాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పేదలు, వృద్ధులను పట్టించుకోని సంస్కరణ అస్సలు సంస్కరణే కాదు, అది తిరోగమనం కూడా అని తెలిపారు. -
జస్టిస్ సూర్యకాంత్ అనే నేను..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ సూర్యకాంత్ హిందీ భాషలో భగవంతుడి పేరిట ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన అక్కడే ఉన్న తన సోదరితోపాటు సోదరుడి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ని ఆతీ్మయంగా ఆలింగనం చేసుకున్నారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్తోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ సూర్యకాంత్ ప్రధాని మోదీ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో తొలిసారిగా ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి భూ టాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్, శ్రీలంక, బ్రెజిల్ దేశాల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావడం విశేషం. ప్రధాని మోదీ అభినందనలు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బీఆర్ గవాయ్, మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ కలిసి ఫొటో దిగారు. కొలీజియం చీఫ్గా జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇకపై సుప్రీంకోర్టు కొలీజియం అధినేతగానూ వ్యవహరించబోతున్నారు. ఇన్నాళ్లూ ఈ పదవిలో ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలం ఆదివారంతో పూర్తయ్యింది. సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐ సహా మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కొలీజియంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎంఎం సుందరేశ్ సభ్యులు.సీజేఐల గురించి ఐదు విశేషాలు!భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 52 మంది ప్రధాన న్యాయమూర్తులు ఈ దేశ న్యాయవ్యవస్థ కాపు కాసినవారే. అయితే మనలో చాలామందికి గత సీజేఐల విశేషాలు తెలిసింది తక్కువే. మహిళ న్యాయమూర్తి ఇప్పటివరకూ ఈ అత్యున్నత పదవిని చేపట్టకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 65 ఏళ్లకు పదవీ విరమణ పొందుతారు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఇది 62 ఏళ్లు మాత్రమే. సుప్రీంకోర్టు సీజేఐకి మాస్టర్ ఆఫ్ ద రోస్టర్గా పేరు. ఏ న్యాయమూర్తి ఏ రకమైన కేసుల విచారణ చేపడతారన్న విషయంపై సీజేఐదే తుది నిర్ణయం. అధికారిక హోదాల ప్రకారం... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, మాజీ రాష్ట్రపతుల తరువాతి స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులది. ఇలాంటివే మరికొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇలా ఉన్నాయి.1. జస్టిస్ హరిలాల్ జెకిసన్దాస్ కానియాదేశ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటు తరువాత నియమితులయ్యారు.2. జస్టిస్ కె.జి.బాలక్రిష్ణన్తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి. 2007-2010 మధ్యకాలంలో పనిచేశారు.3. జస్టిస్ బి.ఆర్.గవాయి52వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది మేలో నియమితులయ్యారు. బౌద్ధ మతాన్ని అనుసరించిన తొలి సీజేఐ. ఈ అత్యున్నత పదవిని అధిష్టించిన రెండో దళితుడు కూడా.4.జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్1978 - 19875 మధ్య దేశ అత్యున్నత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఏడేళ్లకాలం ఈ పదవిలో ఉన్న తొలి జస్టిస్.5. జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్1991లో కేవలం పదిహేడు రోజులు మాత్రమే సీజేఐగా పనిచేశారు. అతితక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తిగా ఇదో రికార్డు. -
53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24వ తేదీన బాధ్యతలు చేపట్టబోతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తదుపరి సీజేఐగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు సంబంధించిన డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ దాదాపు 15 నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలతో రా ష్ట్రపతి ముర్ము జస్టిస్ సూర్యకాంత్ను సుప్రీంకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ సూర్యకాంత్కు అభినందనలు తెలియజేశారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్ జిల్లా పెటా్వర్ గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జని్మంచారు. 1981లో హిసార్లోని ప్రభుత్వ పీజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ లా అభ్యసించారు. 2011లో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి ‘మాస్టర్ ఆఫ్ లా’లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 2000 జూలై 7 నుంచి 2004 జనవరి 8 దాకా హరియాణా ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్గా సేవలందించారు. 2004 జనవరి 9 నుంచి 2018 అక్టోబర్ 4 దాకా పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2018 అక్టోబర్ 5 నుంచి 2019 మే 23 దాకా హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆరేళ్లుగా సుప్రీంకోర్టులో సేవలందిస్తున్నారు. 2000 సంవత్సరం కంటే ముందే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన జస్టిస్ సూర్యకాంత్ 2011లో మాస్టర్ ఆఫ్ లా పూర్తిచేయడం విశేషం.కీలక తీర్పుల్లో భాగస్వామి సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పుల్లో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామ్యం కూడా ఉంది. పలు ధర్మాసనాల్లో ఆయన పనిచేశారు. జమ్మూకశీ్మర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370 రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, అవినీతి, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం వంటి కీలక అంశాల్లో ఆయన తీర్పులిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ తీర్పు ఇచి్చన బెంచ్లో జస్టిస్ సూర్యకాంత్ కూడా సభ్యుడే. ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దని ఆయన ఆదేశించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సహా ఇతర బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఆదేశించి చరిత్ర సృష్టించారు. రక్షణ దళాల్లో వన్ ర్యాంక్–వన్ పెన్షన్ పథకాన్ని సమరి్థంచారు. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలో సభ్యుడిగా పనిచేశారు. జాతీయ భద్రత పేరిట ప్రముఖుల గోప్యతకు భంగం కలిగించడం సరైంది కాదని తేలి్చచెప్పారు. 2022లో మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా పరమైన లోపాలు బయటపడ్డాయి. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్న ధర్మాసనం విచారించింది. -
53వ సీజేఐగా ఆయనే!
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ ఎంపిక కానున్నారు. సూర్యకాంత్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్(BR Gavai) కేంద్రానికి ప్రతిపాదన పంపారు. అన్నీ సక్రమంగా జరిగితే నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్య కాంత్ భారత దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.52వ ప్రధాన న్యాయమూర్తి అయిన బీఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23తో ముగియనుంది. జస్టిస్ సూర్యకాంత్ గతంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. సుప్రీంకోర్టులో ఆయన అనేక కీలక తీర్పులు ఇచ్చారు, ముఖ్యంగా వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (OROP) పథకాన్ని రాజ్యాంగబద్ధంగా సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చనీయాంశమైంది.సూర్యకాంత్.. 1962 ఫిబ్రవరి 10వ తేదీన జన్మించారు. హర్యానాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1984లో న్యాయవాదిగా హర్యానా & పంజాబ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా.. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు.. NALSA (National Legal Services Authority) కార్యనిర్వాహక ఛైర్మన్గా ఇటీవల ఈయన నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నందున.. ప్రస్తుత CJI జస్టిస్ బీఆర్ గవాయి పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. సీజేఐగా సూర్యకాంత్ పదవీ కాలం 2027 ఫిబ్రవరి 9వ తేదీతో ముగియనుంది.


