ట్రిబ్యునళ్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
తీర్పులను ఔట్సోర్సింగ్కు ఇస్తున్నారా? అంత ధైర్యమా?
సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ట్రిబ్యునళ్ల వ్యవస్థ పనితీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ సంస్థలు ఎవరికీ జవాబుదారీగా ఉండటం లేదని, అవి ప్రస్తుతం ‘నో మ్యాన్స్ ల్యాండ్’(ఎవరికీ సంబంధం లేని ప్రాంతం)గా తయారయ్యాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం–2021ను కొట్టివేస్తూ గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వివిధ ట్రిబ్యునళ్ల చైర్మన్లు, సభ్యుల పదవీకాలాన్ని పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్పై గురువారం సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించింది.
మీరు తెచ్చిందే.. మీకే తలనొప్పి
కోర్టు విచారణలో అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణిని ఉద్దేశించి సీజేఐ మాట్లాడుతూ.. ‘ట్రిబ్యునళ్లను సృష్టించింది కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి అవి ఇప్పుడు మీకు తలనొప్పిగా, మాకు పెద్ద భారం (లయబిలిటీ)గా పరిణమించాయి. రెండు మూడు ట్రిబ్యునళ్లు మినహా మిగతావి వెలువరిస్తున్న ఉత్తర్వులను చూస్తుంటే.. అవి ఏమాత్రం జవాబుదారీతనంతో పనిచేయడం లేదని స్పష్టమవుతోందని’వ్యాఖ్యానించారు.
ఎంతటి చెత్త వ్యవస్థను సృష్టించాం..?
ఓ కీలక ట్రిబ్యునల్లో పనిచేస్తున్న సభ్యుడి తీరుపై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ‘టెక్నికల్ మెంబర్’ఏకంగా తాను ఇవ్వాల్సిన తీర్పు లను జ్యుడీషియల్ సభ్యులతో రాయించడం లేదా బ యటి వ్యక్తులకు ‘ఔట్సోర్సింగ్’ఇవ్వడం చేస్తున్నారని సీజేఐ తప్పుబట్టారు.‘అతడికి ఎంతటి ధైర్యం? సరైన సమయం చూసి అతడిని కచ్చితంగా సాగనంపుతాం. కోర్టులపై భారాన్ని తగ్గించుకోవాలన్న ఆత్రుతలో మనం ఎంతటి అస్తవ్యస్తమైన వ్యవస్థను సృష్టించుకున్నామో కదా’అని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే, టెలికాం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (టీడీశాట్)లో చైర్పర్సన్ లేనప్పుడు టెక్నికల్ మెంబర్ ఆ స్థానాన్ని భర్తీ చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. సంస్థాగత సంక్షోభం తలెత్తకుండా చూడాలని, టెక్నికల్ మెంబర్ ఒక్కరే ఉత్తర్వులు జారీ చేయడం కుదరదని జస్టిస్ బాగ్చి కేంద్రానికి తేల్చి చెప్పారు. ట్రిబ్యునల్ సభ్యులకు ఉండాల్సిన కనీస అర్హతలపైనా ధర్మాసనం పెదవి విరిచింది. పర్యావరణ చట్టాలు, వాణిజ్య చట్టాలపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు.. నాలుగేళ్లలో ఆయా అంశాల్లో నిపుణులు ఎలా అయిపోతారని సీజేఐ ప్రశ్నించారు. ఈ వ్యవస్థలో జవాబుదారీతనం లోపించడం జాతీయ ప్రయోజనాలకే విరుద్ధమని, చక్కదిద్దేందుకు కొత్త యంత్రాంగం అవసరమని కోర్టు అభిప్రాయపడింది.


