రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం
త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాçహూతో భారత ప్రధాని మోదీ భేటీ
కీలక రంగాల్లో కలిసికట్టుగా పని చేయాలని తీర్మానం
భారత్, ఇజ్రాయెల్ మధ్య 17 ఒప్పందాలపై సంతకాలు
జెరూసలేం: భారత్, ఇజ్రాయెల్ దేశాలు కాల పరీక్షకు నిలిచిన తమ అనుబంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని, ఇందుకోసం చర్చలు వేగవంతం చేయాలని నిర్ణయానికొచ్చాయి. గాజా శాంతి ప్రణాళికను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఘర్షణల వల్ల మానవత్వం బలి కావొద్దని అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఇజ్రాయెల్కు చేరుకున్న ప్రధాని మోదీ గురువారం జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో సమావేశమయ్యారు.
ఇరుదేశాల సంబంధాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. భారతదేశ రక్షణ ప్రయోజనాలు మధ్య ఆసియాలో శాంతి, స్థిరత్వంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయని మోదీ ఉద్ఘాటించారు. కల్లోలిత గాజాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. మోదీ, నెతన్యాహూ భేటీ సందర్భంగా భారత్, ఇజ్రాయెల్ మధ్య మొత్తం 17 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
కృత్రిమ మేధ(ఏఐ), వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, తయారీ, సంస్కృతి, సముద్ర సంబంధిత వారసత్వ బంధం, వ్యవసాయం తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే ధ్యేయంగా ఇరుదేశాలు ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంతేకాకుండా రక్షణ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం బదిలీ చేసుకోవడం ద్వారా మిలటరీ హార్డ్వేర్ అభివృద్ధి, ఉత్పత్తి విషయంలో కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి.
ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం
మోదీ, నెతన్యాహు సమావేశంలో అమెరికా–ఇరాన్ ఘర్షణ అంశంతోపాటు మధ్య ఆసియా పరిణామాలు ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చాయి. సమస్యలు, సంక్షోభాలను సంప్రదింపులు, దౌత్య మార్గాలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారడానికి శాంతియుత పరిష్కారం కోసం తమవంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత్, ఇజ్రాయెల్ దేశాలు తమ సంబంధాన్ని 2017లో వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చాయి. తాజాగా ఆ బంధం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారింది.
ప్రపంచంలో ఉగ్రవాదానికి స్థానం లేదు
ఆర్థిక సహకారమే రెండు దేశాలకు గ్రోత్ ఇంజన్ అని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. పరస్పరం పెట్టుబడులను ప్రోత్సహించుకోవడానికి గత ఏడాది ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై సంతకాలు చేశామని వెల్లడించారు. అతి త్వరలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదుర్చుకోబోతున్నామని ప్రకటించారు. ఇరుదేశాలకూ లబ్ధి చేకూర్చేలా ఈ ఒప్పందం ఉంటుందన్నారు. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాటం సాగించాలని తాము నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి స్థానం లేదన్నారు. అత్యాధునిక సాంకేతికతల విషయంలో ఇజ్రాయెల్తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు.
ఏఐ, క్వాంటమ్, క్రిటికల్ మినరల్స్ విషయంలో సహకారాన్ని వేగవంతం చేస్తామని వివరించారు. భారత యూపీఐ సేవలను ఇజ్రాయెల్లో ప్రవేశపెట్టడానికి ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. రక్షణ రంగంతోపాటు పౌర అణు ఇంధనం, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదనకు సాంకేతిక సాయం అందించడానికి ఇజ్రాయెల్తో కలిసి ‘సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్’ సంఖ్యను పెంచుతామన్నారు. నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టిన దేశాలకే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టంచేశారు. భారత్, ఇజ్రాయెల్ ఈ రంగంలో కలిసి పని చేస్తాయన్నారు.
ఎఫ్టీఏపై మూడు నెలల్లో చర్చలు
భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై తదుపరి దశ చర్చలు మే నెలలో జరుగుతాయని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. నాలుగు రోజులపాటు జరిగిన మొదటి దశ చర్చలు ఇటీవలే ముగిశాయి. వస్తువులు, సేవల్లో వాణిజ్యం, మేధో సంపత్తి హక్కులు, డిజిటల్ ట్రేడ్ వంటి అంశాలపై ఇరుపక్షాలు సంప్రదింపులు జరిపాయి. భారత్, ఇజ్రాయెల్ మధ్య వాణిజ్యం 3.62 బిలియన్ డాలర్లకు చేరింది. ఆసియాలో ఇజ్రాయెల్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్ కావడం విశేషం.
టెక్ కంపెనీలకు ఆహా్వనం
భారత్లో పెట్టుబడులకు ముందుకు రావాలని ఇజ్రాయెల్ టెక్నాలజీ కంపెనీలను మోదీ ఆహా్వనించారు. భారత యువతతో కలిసి పనిచేయాలని కోరారు. జెరూసలేంలో ఏఐ, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయానికి సంబంధించిన ప్రదర్శనను బెంజమిన్ నెతన్యాహూతో కలిసి మోదీ తిలకించారు. దీనిపై ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
‘భారతీయ’ యూదులతో మోదీ భేటీ
భారతీయ మూలాలున్న యూదులతో ప్రధాని మోదీ గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో ఆతీ్మయంగా సంభాíÙంచారు. ఇజ్రాయెల్లో 85 వేల మందికిపైగా భారతీయ మూలాలున్న యూదులు ఉన్నారు. వీరిలో చాలామంది భారత్ నుంచి వలసవచి్చనవారే. ప్రధాని మోదీ మాటల మనిషి కాదు.. చేతల మనిషి అని యూదు ప్రముఖుడు, అష్కెలాన్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ రికీ షాహా అన్నారు. మోదీతో భేటీ కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో రెండు రోజుల పర్యటన పూర్తిచేసుకొని గురువారం సాయంత్రం స్వదేశానికి బయలుదేరారు.
ఇజ్రాయెల్ అధ్యక్షుడితో మాటామంతి
ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరుదేశాల స్నేహానికి గుర్తుగా హెర్జోగ్ అధికారిక నివాసం వారిద్దరూ కలిసి తొలుత ‘ఓక్’ మొక్క నాటారు. అనంతరం భేటీలో కీలక అంశాలపై చర్చించుకున్నారు. విద్య, స్టార్టప్లు, నవీన ఆవిష్కరణలు, టెక్నాలజీ, అనుసంధానం తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్లో పర్యటించాలంటే హెర్జోగ్ను మోదీ ఆహా్వనించారు.
యాద్ వశేమ్ స్మారకం వద్ద నివాళులు
జెరూసలేంలో యాద్ వశేమ్ స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. మారణహోమంలో బలైపోయిన యూదులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదీ వెంట బెంజమిన్ నెతన్యాహూ కూడా ఉన్నారు. ‘హాల్ ఆఫ్ నేమ్స్’ను వారు సందర్శించారు. మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన తమ బంధువుల పేర్లను మోదీకి నెతన్యాహూ చూపించారు.


