జెరూసలేం: ఇజ్రాయెల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. హోలోకాస్ట్ మెమోరియల్ యాద్ వషెమ్ను ప్రధాని సందర్శించారు. హోలో కాస్ట్ మృతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. 2017లోనూ యాద్ వషెమ్ను మోదీ సందర్శించారు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో (1941–1945) హోలోకాస్ట్లో 60 లక్షల మంది యూదులను హిట్లర్ పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. యూదులను సామూహికంగా హత్య చేయడాన్ని 'హోలోకాస్ట్' అని పిలుస్తారు. హీబ్రూ భాషలో దీనిని 'షోవా' అంటారు.. దీని అర్థం 'పెద్ద విపత్తు'
నిన్న(బుధవారం) టెల్ అవీవ్లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భార్యతో కలిసి మోదీకి స్వయంగా స్వాగతం పలికారు. ‘ప్రియమైన మిత్రునికి స్వాగతం’ అంటూ మోదీని ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. భారత ప్రధానికి స్వాగతం పలకడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా కూడా అతి సన్నిహిత బంధముందని అనంతరం ఎక్స్ పోస్టులో నెతన్యాహు గుర్తు చేసుకున్నారు.
కాగా, ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ‘స్పీకర్ ఆఫ్ ద కెనెసెట్ మెడల్’ దక్కింది. ఆ దేశ పార్లమెంటు ‘కెనెసెట్’ అందజేసే ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని ఆయనే. కెనెసెట్ స్పీకర్ అమీర్ ఒహానా మోదీకి ఆ మెడల్ను ప్రదానం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం అందజేసినట్టు పేర్కొన్నారు.
2018లో పాలస్తీనా కూడా మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తైన్’ అందజేసింది. ఆ రెండు శత్రు దేశాల నుంచీ అత్యున్నత పురస్కారాలు అందుకుతున్న అరుదైన నాయకునిగా మోదీ నిలిచారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధాని కూడా ఆయనే.


