టెల్ అవీవ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. ఫిబ్రవరి 25న టెల్ అవీవ్ చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధానమంత్రి బెన్జమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సమయంలో సారా నెతన్యాహు కాషాయ వర్ణంపు కోటును ధరించారు. ఆమె భారత్పై తనకున్న మక్కువను చాటుకుంటూ, మరోసారి భారత్ను సందర్శించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
సారా నెతన్యాహు 1958 నవంబర్లో హైఫా సమీపంలోని టివోన్లో జన్మించారు. అక్కడి గ్రీన్బెర్గ్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. చిన్నతనం నుంచే చురుకుగా ఉండే సారా టీనేజర్గా ఉన్నప్పుడే ‘మారివ్ లానోర్’ అనే వారపత్రికకు కరస్పాండెంట్గా పనిచేశారు. ఆ తర్వాత 1977 నుంచి 1979 వరకు ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) ఇంటెలిజెన్స్ యూనిట్లో సైకోటెక్నికల్ డయాగ్నోస్టిషియన్గా సేవలందించారు. ఈ బాధ్యతల్లో భాగంగా ప్రత్యేక యూనిట్లు, ఇతర భద్రతా సంస్థలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో ఆమె కీలక పాత్ర పోషించారు.
1979లో టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన సారా, అనంతరం హెబ్రూ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని కూడా అందుకున్నారు. వృత్తి జీవితంలో భాగంగా ఆమె ఎల్ అల్ (El Al) ఎయిర్లైన్స్లో ఫ్లైట్ అటెండెంట్గా కూడా పనిచేశారు. ఆ సమయంలోనే ఆమెకు బెన్జమిన్ నెతన్యాహుతో పరిచయం ఏర్పడి, అది వివాహానికి దారితీసింది. వృత్తిపరంగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆమె ఎంతో యాక్టివ్గా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం చైల్డ్ సైకాలజిస్ట్గా సేవలందిస్తున్న సారా.. క్యాన్సర్ బాధితులు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, గృహహింసకు గురైన మహిళలకు అండగా నిలిచే సంస్థలలో వలంటీర్గా పనిచేస్తున్నారు. బెన్జమిన్ నెతన్యాహు, సారా నెతన్యాహు దంపతులకు యాఇర్, అవ్నేర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: నేటి నుంచి రాజ్యసభ నామినేషన్ల స్వీకరణ


