జెరూసలేం: అంతర్జాతీయ దౌత్య చరిత్రలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని అధిగమించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా వంటి పరస్పర విరుద్ధ దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న అతికొద్ది మంది ప్రపంచ నేతలలో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. బుధవారం ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటు(క్నెసెట్)ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయడంలో ఆయన చూపిన అసాధారణ చొరవకు గుర్తింపుగా క్నెసెట్ స్పీకర్ అమీర్ ఓహానా ప్రధానికి ‘స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్’ను ప్రదానం చేశారు. ఈ అత్యున్నత గౌరవ పతకాన్ని అందుకున్న తొలి విదేశీ నేత కూడా మోదీయే కావడం విశేషం. ఇది వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన మైత్రికి, పంచుకున్న విలువలకు నిదర్శనమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
#Jerusalem | PM Modi was awarded the Knesset Speaker's Medal during his address to the Israeli parliament on Wednesday, becoming the first Indian prime minister to receive the honour.
The medal recognised his personal role in strengthening strategic ties between India and… pic.twitter.com/uYbPANKBvU— Deccan Chronicle (@DeccanChronicle) February 25, 2026
నరేంద్ర మోదీ 2018లో పాలస్తీనా పర్యటన సందర్భంగా ఆ దేశ అత్యున్నత ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ పురస్కారాన్ని అందుకున్నారు. తద్వారా పశ్చిమాసియాలోని ఇరు పక్షాల గౌరవాన్ని చూరగొన్న అరుదైన దౌత్యవేత్తగా ఆయన ఘనత సాధించారు. తన తాజా ప్రసంగంలో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటాన్ని ప్రకటించారు. ఎక్కడ ఉగ్రవాదం తలెత్తినా అది ప్రపంచ శాంతికే ముప్పు అని హెచ్చరిస్తూ, హమాస్ అక్టోబర్ 7న జరిపిన అనాగరిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాద బాధితుల వేదనను భారత్ అర్థం చేసుకుంటుందని, ముంబై 26/11 దాడులను గుర్తు చేస్తూ ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’ విధానంలో ఇరు దేశాలదీ ఒకే బాట అని పేర్కొన్నారు.
మరోవైపు పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన ‘గాజా శాంతి చొరవ’కు భారత్ మద్దతు ప్రకటించింది. ఈ చొరవ పాలస్తీనా సమస్యతో పాటు ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ న్యాయమైన, శాశ్వతమైన శాంతిని చేకూరుస్తుందని ప్రధాని నమ్మకం వ్యక్తం చేశారు. సంభాషణలు, చర్చల ద్వారానే స్థిరత్వం సాధ్యమని, భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపు నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. తొమ్మిదేళ్లలో రెండోసారి ఇజ్రాయెల్ సందర్శించిన మోదీకి బెన్ గురియన్ విమానాశ్రయంలో ప్రధాని నెతన్యాహు దంపతులు ఘనస్వాగతం పలికారు.


