బ్రెజిల్‌ అతలాకుతలం.. భీకర వరదలతో 46 మరణాలు.. | Brazil floods Emergency workers continue search for missing residents | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌ అతలాకుతలం.. భీకర వరదలతో 46 మరణాలు..

Feb 26 2026 7:23 AM | Updated on Feb 26 2026 7:23 AM

Brazil floods Emergency workers continue search for missing residents

జూయిజ్‌ డీ ఫోరా: బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రం మినాస్‌ గెరాయిస్‌ను భీకర వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రంలోని జూయిజ్‌ డీ ఫోరా, ఉబా నగరాల్లో లక్షలాది మంది ప్రజల జనజీవన అస్తవ్యస్థమైంది. వరద సంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 46 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. ఇంకా చాలా మంది జాడ తెలీకుండా పోయిందని సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని అధికారులు ప్రకటించారు. 21 మంది గల్లంతు అయినట్టు అధికారులు చెబుతున్నారు.

ఇక, రాత్రిళ్లు సైతం రిస్క్యూ బృందాలు తమ విధుల్లో నిమగ్నమయ్యాయి. ముంపు ప్రాంతాల్లోని 3,000 మందిని బుధవారం ఉదయం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరి కొద్దిరోజులపాటు భారీ వర్షాలుకురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 5,60,000 జనాభా ఉండే జూయిజ్‌ డీ ఫోరా నగర వీధులన్నీ బురదలో నిండిపోయాయి. సమీపంలోని కొండచరియలు మరోసారి విరిగిపడే ప్రమాదముందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

1,07,000 జనాభా ఉన్న ఉబా నగరంలో జనజీవనం స్తంభించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సోమవారం ఉదయం నుంచి మొదలైన వానలకు ఇప్పటిదాకా 20 కొండచరియలు విరిగిన ఘటనలు నమోదయ్యాయని మేయర్‌ మార్గరీడా సాలమావో చెప్పారు. వరదబాధిత ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటోందని, బాధిత కుటుంబాలకు తగుసాయం అందిస్తామని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లాలూ డ సిల్వా భరోసా ఇచ్చారు. కొండలు, లోయలు, లోతట్టు ప్రాంతాలకు వైద్య బృందాలను పంపించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement