న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్ సహా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నేటి నుంచి మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు.
ఒకవేళ నిర్ణీత స్థానాల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే, మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు రాత్రి ఫలితాలను వెల్లడిస్తారు. ఏప్రిల్ నెలలో పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతుండటంతో, ఎన్డీయే కూటమి తన బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
మహారాష్ట్రలో ఏడు, తమిళనాడులో ఆరు, బీహార్, వెస్ట్ బెంగాల్లో ఐదు , ఒడిశాలో 4, అస్సాంలో 3, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానాలో 2, హిమాచల్ ప్రదేశ్ లో ఒక సీటుకి ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మంత్రులు రాందాస్ అథవాలే రామ్నాథ్ ఠాకూర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరి వంశ, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ,ఆర్ ఎల్ ఎం నేత ఉపేంద్ర కుష్వాహ, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింగ్వి, అన్నా డీఎంకే ఎంపీ తంబీ దురై డిఎంకే ఎంపీ తిరుచి శివల పదవీ కాలం ఏప్రిల్తో ముగియనుంది.
కాగా వీరిలో రాందాస్ అథవాలే, అభిషేక్ సింగ్వి, శరత్ పవర్ మరోమారు బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. 37 సీట్లలో ఎన్డీఏకు 21 సీట్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. బిజెపి సీట్ల పెరుగుదలలో మహారాష్ట్ర, బీహార్ కీలక పాత్ర పోషించనున్నాయి. రాజ్యసభలో ప్రస్తుతం బిజెపికి 103 సీట్లు, మిత్రపక్షలతో కలిసి 133 సీట్ల బలం ఉంది. రాజ్యసభలో మెజారిటీ మార్క్ 122.


