పురపోరులో ఇదే ఎజెండాతో ప్రజల వద్దకు బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచార పర్వంపై బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని, ప్రచార ఆర్భాటం లేకుండా స్థానిక నేతలు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన స్థానిక అభివృద్ధి, రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయం కోసం వార్ రూమ్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రచార పర్యవేక్షణ బాధ్యత పార్టీ సమన్వయకర్త లకు అప్పగించింది.
116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేష న్లకు కలిపి మొత్తం 125 మంది సమన్వయకర్తలుగా నియమించింది. అవసర మైన చోట మరికొంత మందిని కూడా సమన్వయ కర్తలుగా నియమించడంపై కసరత్తు జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావులు అవసరమైన చోట కార్నర్ మీటింగ్లు, రోడ్ షోల్లో పాల్గొనే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
క్యాంప్ను వీడిన కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థులు
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకుని కాంగ్రెస్ ఏకగ్రీవా లకు సహకరించకుండా ఉండేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి, కొడంగల్, మద్దూరు మున్సి పాలిటీల్లో ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో వచ్చినట్లు పార్టీ నేతలు తెలిపారు.
దీంతో పార్టీ అభ్యర్థులను కాపాడు కునేందుకు బీఆర్ఎస్ పార్టీ మూడు మున్సిపాలిటీ ల్లోని అభ్యర్థులను రెండు రోజులుగా ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థులు క్యాంప్ను వీడి తమ ఇళ్లకు చేరుకుని ప్రచారాన్ని ప్రారంభించారు.
ఉభయ కమ్యూనిస్టులతో స్థానిక పొత్తులు
కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సీపీఐతోపాటు సీపీఎం పార్టీతోనూ బీఆర్ఎస్ పలు చోట్ల అవగా హన కుదుర్చుకుంది. మహబూబాబాద్, భువన గిరి, చౌటుప్పల్, క్యాతనపల్లి, బెల్లంపల్లితో పాటు నల్గొండ, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్ల పరిధిలో స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒకటీ అరా స్థానాలను ఉభయ కమ్యూ నిస్టు పార్టీలకు బీఆర్ఎస్ కేటాయించింది. సీపీఐ ఎమ్మెల్యే ఉన్న కొత్తగూడెంలో సీపీఐ, సీపీఎం బీఆర్ఎస్తో అవగాహన కుదుర్చుకున్నాయి.
ఒకటీ అరా వార్డులు ఏకగ్రీవం
కాంగ్రెస్ నుంచి ఎదురైన బెదిరింపులు, ఒత్తిళ్లతో ఒకటీ అరా వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రామగుండం, మహబూబ్నగర్ మున్సి పల్ కార్పొరేషన్ల పరిధిలోని ఒక్కో వార్డులో బీఆర్ ఎస్ అభ్యర్థులు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ ఏకగ్రీవాలకు మార్గం సుగమం చేశారు.
యాదగిరిగుట్ట, పరకాల, చౌటుప్పల్, మెదక్ మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పదో వార్డు అభ్యర్థిని బెదిరించి పోటీ నుంచి వైదొలిగేలా చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది.


