ఉపసంహ'రణమే' | The last day witnessed many dramatic developments | Sakshi
Sakshi News home page

ఉపసంహ'రణమే'

Feb 4 2026 4:35 AM | Updated on Feb 4 2026 4:35 AM

The last day witnessed many dramatic developments

చివరి రోజు ఎన్నెన్నో నాటకీయ పరిణామాలు..

మున్సిపల్‌ నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజైన మంగళవారం అనేక చోట్ల ఎన్నెన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచిత్ర సన్నివేశాలు సాక్షాత్కరించాయి. కొన్నిచోట్ల బీఫామ్‌ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడం, మరికొన్నిచోట్ల ఒకరికి బదులు మరొకరికి బీఫామ్‌ ఇవ్వడం, పోటీలో ఉన్న అభ్యర్థులు చివరి క్షణాన బరిలో నుంచి తప్పుకోవడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. బీఫామ్‌ ఇవ్వలేదంటూ పలువురు కన్నీటి పర్యంతం కాగా, కొందరు ఆందోళనకు దిగారు. మరికొందరు పార్టీ నేతల దిష్టి»ొమ్మలను దహనం చేశారు.

చౌటుప్పల్‌లో ఆ వార్డులో చివరి నిమిషంలో ట్విస్ట్‌
చౌటుప్పల్‌: నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున నాటకీయ పరిణామాల నడుమ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ఏకగ్రీవమైంది. కాంగ్రెస్‌ నుంచి చింతల ఉమామహేశ్వరి, పస్తం మల్లమ్మ టికెట్‌ ఆశించారు. పార్టీ అధిష్టానం పస్తం మల్లమ్మను అభ్యర్థిగా ఖరారు చేసింది. దీంతో చింతల ఉమామహేశ్వరి అలకబూనింది. నామినేషన్ల సమయంలో ఆమె ఒక సెట్‌ కాంగ్రెస్‌ తరఫున, మరో సెట్‌ బీఆర్‌ఎస్‌ తరఫున దాఖలు చేసింది. 

కాంగ్రెస్‌ పార్టీ మల్లమ్మను అభ్యర్థిగా ప్రకటించడంతో మూడు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో ఉమామహేశ్వరి బీఆర్‌ఎస్‌లో చేరింది. కాగా నామినేషన్‌ల ఉపసంహరణ సమయంలో వార్డులో నామినేషన్‌ వేసిన ఇతరుల చేత ఉపసంహరింపచేయించారు. దీంతో మంగళవారం నాటికి ఇద్దరు అభ్యర్థులే మిగిలారు. బీఫామ్‌ సమర్పించే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చింతల ఉమామహేశ్వరికి బీఆర్‌ఎస్‌ బీఫామ్‌ అందజేసింది. 

అదే సమయంలో ఆమెకే కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా బీఫామ్‌ అందింది. అప్పటికే కాంగ్రెస్‌ నాయకులు వ్యూహాత్మకంగా ఉన్న విషయాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు పసిగట్టలేకపోయారు. ముందుగానే పస్తం మల్లమ్మతో నామినేషన్‌ ఉపసంహరణ విషయంలో కాంగ్రెస్‌ నేతలు ఒప్పించారు. బీఫామ్‌ సమర్పించే సమయంలో మల్లమ్మ నేరుగా ఆర్వో›వద్దకు వెళ్లి తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో ఉమామహేశ్వరి ఒక్కరే మిగలడంతో ఆమెను ఏకగ్రీవంగా ప్రకటించారు. విషయం తెలిసి బీఆర్‌ఎస్‌ శ్రేణులు కార్యాలయంలోకి వెళ్లి వాగ్వాదానికి దిగారు. అదే క్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు సైతం ఎదురు దాడి చేశారు.  

» 13వ వార్డును సైతం ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి నామినేషన్‌ వేసిన తొర్పునూరి నర్సింహగౌడ్‌చే వ్యూహాత్మకంగా ఉపసంహరింపజేశారు. మరో ఇద్దరిని కూడా ఉపసంహరింపజేసే క్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన వాహనంలో తీసుకొని వెళ్లిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement